పాట్నా: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ఆందోళన ముగిసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిహార్ బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) పై ఆందోళన కేవలం ఒక సాకు మాత్రమేనని, వాస్తవానికి ఓబీసీ సమాజానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఒక ఓబీసీ సమాజానికి చెందిన విద్యాశాఖ మంత్రి బలి అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిఖిల్ ఆనంద్ ప్రతిపక్షంపై దాడి
భారత ప్రజలందరూ దేశ వ్యతిరేక, సనాతన- హిందూ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలని నిఖిల్ ఆనంద్ అన్నారు. ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు, పార్లమెంటులో చర్చకు భయపడి పారిపోవడం దురదృష్టకరమని అన్నారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఈ ఆందోళన సీఏఏ- ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన షాహీన్బాగ్, సింధు సరిహద్దులో జరిగిన రైతుల ఆందోళనల థర్డ్ ఫేజ్ మాత్రమేనని అన్నారు. ఈ రాజకీయాల్లో అన్ని వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు భాగస్వాములు ఉన్నాయి.
కుటిల రాజకీయాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి
భారత ప్రజలను హెచ్చరిస్తూ నిఖిల్ ఇలా విజ్ఞప్తి చేశారు. ఈ కుటిల రాజకీయాలను దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యా సమస్యను లేవనెత్తినప్పటికీ, లక్ష్యం మాత్రం దేశ వ్యతిరేక, సనాతన హిందూ వ్యతిరేక రాజకీయాలను స్థాపించడం అన్నారు. మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిహార్ ప్రభుత్వ మంత్రి రామ్కృపాల్ యాదవ్ స్పందించారు. ’ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం బాధాకరం. ఆయన దేశానికి చాలా ఇచ్చారు. దేశం కోసం, మరియు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఆయన చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రి పదవిలో లేకపోవడం బాధాకరం’ అన్నారు.
ముందు వాంగ్ చుక్ దీక్ష విరమణ.. నెక్ట్స్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం, జెన్జీ విద్యార్థుల సుదీర్ఘ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. జూలై 20న జంతర్ మంతర్ వద్ద లాఠీఛార్జ్ అనంతరం సీజేపీ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. సోనమ్ వాంగ్చుక్ నిరసన ఉపవాసం విరమించినా, ప్రతిపక్షాల ఒత్తిడి పెరగడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. దీనిని విద్యార్థి లోకం సాధించిన చారిత్రాత్మక విజయంగా రాజకీయ వర్గాలు అభివర్ణించాయి.
మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పండరీపురంలో ఆషాఢీ ఏకాదశి పూజలు ముగించుకుని, బిజెపి అధిష్టానం అత్యవసర పిలుపుమేరకు హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. దాంతో ఫడ్నవీస్ కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. దాంతో మహారాష్ట్రలో కొత్త సీఎంతో రాజకీయాలు మారేలా ఉన్నాయి. ఫడ్నవీస్ కేంద్ర మంత్రి అయితే, ఆయన స్థానంలో కొత్త సీఎం రానున్నారు.
