AP NDA Coalition Politics: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ పెద్దల తలుపులు ఆయన కోసం ఎప్పుడూ తెరిచే ఉండేవి.   ఆయన ఎప్పుడు దిల్లీ వెళ్లినా ప్రధాని, హోంమంత్రుల అపాయింట్‌మెంట్లు సులువుగా లభించేవి. కానీ, నేడు ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమవ్వడమే కాకుండా, కేంద్రంలో ఏపీలోని కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేనలు ఎన్డీఏ లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ తరుణంలో జగన్ ఢిల్లీ మంత్రాంగం ఆయనకే రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Continues below advertisement

 ఎన్డీఏ భాగస్వాములపై ఫిర్యాదు.. వ్యూహాత్మక తప్పిదమేనా? 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీల సంయుక్త ఎన్డీఏ ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే మోదీ, అమిత్ షాల నాయకత్వంలోని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు కీలక భాగస్వాములు. ఇలాంటి సమయంలో, రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి జగన్ వెళ్లి అదే ఎన్డీఏ పెద్దలను కలవాలని చూడటం రాజకీయంగా రివర్స్ అవుతుంది.  కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన స్వంత కూటమి భాగస్వాములను పక్కనబెట్టి, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ప్రాధాన్యత ఇస్తుందని భావించడం వ్యూహాత్మక అపరిపక్వతే అవుతుంది. కూటమి ప్రభుత్వంపై మోదీ, షాలకు ఫిర్యాదు చేసినా, దానికి ప్రాధాన్యత లభించకపోగా.. జగన్ రాజకీయంగా మరింత రక్షణలో పడే ప్రమాదం ఉంది.

Continues below advertisement

 కేసుల నుంచి రక్షణ కోసమేనా? బలపడుతున్న ప్రచారం! 

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు,  అపాయింట్‌మెంట్ల ప్రయత్నాలు జరిగిన ప్రతిసారీ ప్రజాక్షేత్రంలో ఒక్కటే బలమైన ప్రచారం జరుగుతుంది. అదేమిటంటే.. ఆయనపై ఉన్న సీబీఐ, ఈడీ అక్రమాస్తుల కేసులు, ఇతర విచారణల నుంచి ఉపశమనం పొందేందుకే ఆయన బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారనే భావన. గత ఐదేళ్ల పాటు పార్లమెంట్‌లో ఎన్డీఏకి అవసరమైన ప్రతి బిల్లుకూ ముందూ వెనుక ఆలోచించకుండా బేషరతుగా మద్దతు ప్రకటించిన జగన్, ఇప్పుడు కూడా బీజేపీ  గుడ్  లుక్స్‌  లో ఉండేందుకే తాపత్రయపడుతున్నారని  భావిస్తున్నారు. ఈ తరహా పర్యటనలు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా సాధించే ప్రజాదరణ కంటే, కేసుల భయంతోనే ఢిల్లీ పెద్దలకు నమస్కరిస్తున్నారు అనే ముద్రను మరింత బలపరుస్తాయి.

 సొంత పార్టీ క్యాడర్‌లో గందరగోళం! 

ఒకపక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, బీజేపీతో కలిసున్న చంద్రబాబు-పవన్ జోడీని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ.. మరోపక్క అదే బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్‌ కోసం  ప్రయత్నాలు చేయడం వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయి క్యాడర్‌లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. పార్టీ శ్రేణులు రాష్ట్రంలో కూటమిపై పోరాడాలా లేక ఢిల్లీ స్థాయిలో సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయని మౌనంగా ఉండాలా అనే సందిగ్ధంలో పడిపోతున్నాయి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడి బలం పుంజుకోవాల్సిన సమయంలో, అధినేత పదేపదే ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం చూడటం పార్టీ సైద్ధాంతిక స్టాండ్‌నే ప్రశ్నించేలా చేస్తోంది. ఈ భేటీలు ఒకవేళ సాధ్యమైనా, జగన్ రాజకీయంగా సాధించేది ఏమీ ఉండదనేది రాజకీయ విశ్లేషకుల స్పష్టమైన అంచనా.   జగన్ ఇస్తే ఒకట్రెండు రాజ్యసభ ఓట్లు తప్ప, లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ బలం నామమాత్రంగా మారింది. అలాంటప్పుడు కేంద్ర పెద్దలు తమ కూటమి భాగస్వామి అయిన చంద్రబాబును కాదని జగన్‌కు రాజకీయ ప్రాధాన్యత లేదా ఊరట ఇస్తారనుకోవడం పొరపాటే. ఈ ప్రతిపాదన వల్ల కూటమి నేతలకు జగన్‌ను  ఢిల్లీకి వెళ్లి చేతులు కట్టుకుని నిలబడే నాయకుడు  అని విమర్శించేందుకు అనువైన ఆయుధం దొరికినట్లవుతుంది.

వ్యూహాలు మార్చుకోవాల్సిన సమయం

ఓ వైపు కేంద్రంపై వ్యతిరేకత పెరుగుతోందన్న వాతావరణం ఏర్పడుతోంది. ఢిల్లీలో కాక్రోచ్‌ల ఉద్యమం ఓ రేంజ్‌కు చేరుకుంది.   ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వైఎస్సార్‌సీపీకి అత్యంత అవసరమైనది ప్రజల్లో ఉండటం, అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను పటిష్టంగా పోషించడం. ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లి హాజరు వేయించుకోవడం వల్ల లేదా వినతిపత్రాలు ఇవ్వడం వల్ల వచ్చే పొలిటికల్ మైలేజ్ శూన్యం. దానికి బదులుగా, ఆ పర్యటనలు తెచ్చే రాజకీయ ప్రతికూలత, పక్షపాత ముద్రలు పార్టీకి మరింత నష్టాన్ని కలిగిస్తాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే అపాయింట్మెంట్ లభిస్తే.. బయట ప్రచారం ఉన్నట్లుగా టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీకే మోదీ ప్రాధఆన్యం ఇస్తారని అనుకుంటారు. కానీ అది కూడా వైసీపీకి ఏ విధంగానూ మేలు చేయదు.