Rajya Sabha Members From Andhra Pradesh :  ఏపీలో వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య తమ పదవులకు రాజీనామాలు చేశారు. అవి ఖాళీ అయ్యాయి. ఎన్నికల సంఘం రేపోమాపో ఉపఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ సందర్భంగా ఆ సీట్లు ఎవరికి కేటాయిస్తారన్నదానిపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే హైకమాండ్ ఈ అంశంపై ఓ స్పష్టతకు వచ్చిందని చెబుతున్నారు. ముగ్గురు పేర్లు ఖరారయ్యాయని.. ఒక స్థానం జనసేనకు కేటాయిస్తారని చెబుతున్నారు. 


గల్లా జయదేవ్


తెలుగుదేశంపార్టీ తరపన గుంటూరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ వైసీపీ ప్రభుత్వం, జగన్ వేధింపుల కారణంగా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కంపెనీని కూడా తెలంగాణలో విస్తరిస్తున్నారు. అయితే టీడీపీకి మాత్రం గట్టి సపోర్టుగానే ఉంటున్నారు. గల్లా కుటుంబానిక రాజకీయం ఉన్న చరిత్ర దృష్ట్యా సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనకు ఓ రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేస్తారని భావిస్తున్నారు. 


పిత్తపరిగల వేట ఎన్నాళ్లు, తిమింగలాన్ని పట్టుకోండి- ప్యాలెస్‌ డొంక కదిలించండి- ప్రభుత్వానికి షర్మిల సూచన


అశోక్ గజపతిరాజు


టీడీపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ అశోక్ గజపతిరాజు. మాజీ రాష్ట్ర మంత్రిగా.. కేంద్ర మాజీ మంత్రిగా పని చేశారు. విజయనగరం జిల్లా టీడీపీకి ఆయన పెద్ద దిక్కు. అయితే వయసు కారణం, అనారోగ్యాలతో అంత యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన సీనియారిటీని గుర్తించేలా చంద్రబాబు రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 


జనసేన నుంచి నాగబాబు


మూడో స్థానాన్ని  జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లుగా తెలుస్తోంది జనసేన  తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు పేరు ఖరారయిందని అంటున్నారు. ఆయన అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూటమి సర్దుబాట్లలో భాగంగా ఆ స్థానం బీజేపీకి పోవడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా ఆయనను రాజ్యసభకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 



Also Read: తిరుపతి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన పాపం పోవాలి- వైసీపీ నేతల ప్రత్యేక పూజలు