YSRCP: వైఎస్‌ఆర్‌సీపీకి కొత్త సమస్య వచ్చి పడింది. ముందు విజయసాయిరెడ్డి, తర్వాత దువ్వాడ, ఇప్పుడు అనంతబాబు. ఇలా రోజుకొకరిపై  ఆరోపణలు రావడంతో ఆ పార్టీకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే టాక్ ఆఫ్‌ది తెలుగు స్టేట్స్‌ అయిన దువ్వాడపై మాత్రం చర్యలు తీసుకున్నారు. టెక్కలి ఇంచార్జీగా తొలగించారు. దీనిపై దువ్వాడ అనుచరులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


దువ్వాడ కో న్యాయం మిగిలిన వాళ్ళకో న్యాయమా జగన్? ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీలో ఇదే మెయిన్ టాపిక్‌గా మారింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. భార్య బిడ్డలు ఉండగా మరొక స్త్రీతో ఆయన కలిసి ఉంటున్నరనే ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో ఆయన భార్యాపిల్లలు రొడ్డుకెక్కారు. న్యాయం చెయ్యాలని దువ్వాడ ఇంటి ముందే నిరసనలకు దిగారు. వారం పదిరోజులు ఇష్యూ కూల్ అవుతుందని చూసిన వైసీపీ.. పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆయన్న్ని టెక్కలి ఇంచార్జ్‌ పదవి నుంచి తప్పించింది. ఆస్థానం లో పేరాడ తిలక్‌ను నియమించారు పార్టీ అధినేత జగన్. 


మరి మిగిలిన వాళ్లపై చర్యలు ఏవి?
దువ్వాడ శ్రీనివాస్‌పై చర్యలకు కారణం ఇదీ అంటూ పార్టీపైకి చెప్పకపోయినా దువ్వాడ ఫ్యామిలీ గొడవే రీజన్ అని ఒప్పుకునే పరిస్థితి. విచిత్రం ఏంటంటే ఈ గొడవలో తమ పాత్ర లేదని దువ్వాడగానీ ఆయనతో ఉంటున్న మహిళగానీ ఎక్కడా దాయడం లేదు. బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. ఇది చట్ట పరిధిలోని అంశం.అక్కడే తేల్చుకుంటామని వాళ్ళు చెబుతున్నారు. అయితే నైతిక విలువల కోణంలో వైసీపీ ఈ గొడవలోకి ఎంట్రీ ఇచ్చింది. 


ఇంత వరకు బాగానే ఉంది కానీ ఇంతకంటే దారుణమైన అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఇతర ముఖ్య నేతలపై మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు పార్టీలో లేకపోవడంపై దువ్వాడ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కీలక నేతల్లో అతిముఖ్యుడైన విజయ సాయిరెడ్డిపై ఎంతటి భయంకరమైన ఆరోపణ వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాలకు తెలియంది కాదు. కానీ దానిపై పార్టీ పెద్దలు ఎవ్వరూ స్పందించలేదు. అందులో పార్టీ నేతల కుట్ర ఉందని ఆయనే స్వయంగా ప్రకటించారు. అయినా కూడా ఎలాంటి చర్యా పార్టీపరంగా తీసుకోలేదు. 



మొన్నటికి మొన్న అనంతబాబు విషయంలో కూడా పార్టీ స్పందించలేదు. ఆయన వీడియోలు అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. అయితే తన వీడియోను మార్ఫింగ్ చేశారని అనంతబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈయనపై హత్య కేసు కూడా ఉంది. ఆ విషయాన్ని పార్టీ పెద్దగా పట్టించులేదు. మొదట్లో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించినా తర్వాత ఆయన పార్టీ అధినేత జగన్ పర్యటనల్లో కనిపించారు. గతంలో అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్ లాంటి వారి పైనా పెద్దగా చర్యలు తీసుకోలేదు పార్టీ. 


Also Read: ప్రకాశం జిల్లాలో దారుణం - వేధిస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య


బాబాయ్ హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి అయితే స్వయంగా సీఎం హోదాలోనే జగన్‌ క్లీన్ చిట్ ఇచ్చేశారు. మరి ఇంతమంది ఇన్ని ఆరోపణలు వివాదాలు ఎదుర్కొన్నా వారిపై లేని చర్యలు దువ్వాడపైనే ఎందుకు అన్నది పార్టీ పెద్దలకే తెలియాలి అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ అభిమానులు. 


అప్పుడెప్పుడో SVBC చైర్మన్ హోదాలో ఉన్న సినీ నటుడు పృథ్వీపై ఫోన్ టాక్ వైరల్ ఇష్యూలో చర్యలు తీసుకుంది వైసీపీ. అప్పుడు కూడా ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేసింది లేదు. అదంతా బడా నాయకులు తనపై చేసిన కుట్ర అంటారు పృథ్వీ. కానీ నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వారిని తాత్కాలికంగా కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టడం అనేది రాజకీయాల్లో మంచి సంప్రదాయమే. కానీ అందరి నేతలకూ ఇది ఒకేలా ఎందుకు వర్తించదు అనేదే ప్రస్తుతం హాట్ టాపిక్.


Also Read: ఏలేరు కాలువలో దొరికిన ఓ యువతి మృతదేహంతో అనంతబాబుకు లింక్‌- టీడీపీ ఎమ్మెల్యే శిరీష్ సంచలన ఆరోపణలు