Telangana Politics :  భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హతా వేటు పడుతుందని ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ ఘంటాపథంగా చెబుతున్నారు. అంతకు మందు తాము విలీనం చేసుకున్నామని ఫిరాయింపులు కాదని అందుకే అనర్హతా వేటుకు అవకాశం లేదని కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని అందుకే అనర్హతా వేటు ఖాయమంటున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు. హైకోర్టులో పిటిషన్లుపై విచారణ జరుగుతున్నాయి. కేటీఆర్ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయా అంటే.. చాన్సే లేదన్న భావన ఎక్కువగా వినిపిస్తోంది. 


ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే ?


ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం  ప్రజాప్రతినిధిగా ఎన్నికల పార్టీకి రాజీనామా చేసినా  ఇతర పార్టీ సభ్యత‌్వం తీసుకున్నా  అనర్హులవుతారు.  1985లో రాజీవ్​గాంధీ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఫిరాయింపుల వ్యతిరేకతపై 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీనిని రాజ్యాంగంలో 10వ షెడ్యూల్​లో చేర్చారు. అయితే... అంతా స్పీకర్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ చట్టం కింద ఒక సభ్యుని అనర్హతకు కోర్టులకు అధికారం లేదు.   పార్టీ ఫిరాయింపు, పార్టీలో చీలిక, పార్టీ విప్​ను ధిక్కరించి ఓటు వేయడం లేక గైర్హాజరు కావడం మొదలైన అంశాలు వివాదాస్పదంగా మారినప్పుడు  ఆ వివాదాలపై అంతిమ నిర్ణయం స్పీకర్​కు వదిలేయాలని చట్టంలో ఉంది. 


ఇప్పుడు స్పీకర్లు అధికార పార్టీకి తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు. 


అధికార పార్టీకి చెందిన స్పీకర్లు  ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదు. చట్టంలో ఉన్న లొసుగుల్ని బట్టి  రాజకీయ నేతలు కూడా వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది కానీ.. అది స్పీకర్ చేతుల్లో ఉంటుంది కాబట్టి... ప్రయోజనం లేకుండా పోయింది. దేశంలో స్పీకర్లందరూ... అదే చేస్తున్నారు. ఈ చట్టాన్ని మార్చాలి. పార్టీ మారిన వెంటనే అనర్హతా వేటు పడేలా చేయాలి. అలా చేస్తే తప్ప ఇప్పుడు కేటీఆర్ చెబుతున్నట్లుగా అనర్హతా వేటు  పడటానికి అవకాశం లేదు. 


మళ్లీ మేడిగడ్డ చుట్టూ రాజకీయం - బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాటర్ కౌంటర్లు !


గతంలో బీఆర్ఎస్ స్పీకర్లూ అదే చేశారు !


పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ స్పీకర్లూ అదే చేశారు. కేటీఆర్ తాము ఎల్పీలను విలీనం చేసుకున్నామని చెబుతున్నారు. కానీ 2014లో మొదట టీడీపీ సభ్యులను చేర్చుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన బీఆర్ఎస్  సర్కార్ లో మంత్రిగా ఉన్నారు.  ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. టీడీపీ దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లను పట్టించుకోలేదు. శాసనమండలి చైర్మన్ కూడా అదే చేశారు. 


ఏపీలో భారీగా ఐఎఏస్‌ల బదిలీ, ఏకంగా 62 మందికి కొత్త పోస్టింగ్- ఉత్తర్వులు జారీ


మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తున్న కేటీఆర్ 


  2022 మేలో శివసేన నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  2023 జూలైలో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌, తన పార్టీని చీల్చి 40 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్సీలతో కలిసి షిండే క్యాబినెట్లో చేరి ఉపముఖ్యమంత్రిగా  పదవి తీసుకున్నారు.  ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌కు లేఖ అందజేశారు. అయితే స్పీకర్‌ పట్టించుకోక పోవడంతో శరద్‌ పవార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలుమార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కానీ ఫలానా నిర్ణయం అని చెప్పలేదు. అదే సమయంలో స్పీకర్ కూడా తన విచక్షణాధికారం అని సుప్రీంకోర్టు ఆదేశాలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే తర్వాత నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మహారాష్ట్ర వరకే పరిమితం కనీ దేశానికి వర్తిస్తాయని.. కేటీఆర్ వాదిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వ లాయర్లు మాత్రం స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేరని వాదిస్తున్నారు. 


ఎలా చూసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారమే ఫైనల్. ఆయన తన పార్టీ నిర్ణయం.. గత సంప్రదాయాల ప్రకారమే వ్యవహరించే అవకాశం ఉంది. అంటే అనుకుంటే తప్ప... ఎవరిపైనా అనర్హతా వేటు పడే అవకాశం లేదు.