పవన్ కళ్యాణ్  ..తెలుగు రాజకీయాల్లో ఒక బలమైన ఫోర్స్. ఆయనకున్న ఆకర్షణ.. అభిమాన జనం అసాధారణం. అయితే..పార్టీ పెట్టి పదేళ్లు గడిచినా....జనసేన ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో బలం పుంజుకోలేదు. సీట్లు గెలవలేదు. కారణం పార్టీ విధానాలూ.. పోకడల్లో నెలకొన్న సమన్వయం లోపాలే తప్ప జనం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయాన్ని అధినేత పవన్ కల్యాణ్ గ్రహించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  


ఆదాయం వదిలి రమ్మని ఎవరన్నారు - పవన్ జీ


ఈ మధ్య పవన్ కల్యాణ్ పదే పదే వాడుతున్న మాట " ఎంతో ఆదాయం ఇచ్చే సినిమాలను వదులుకుని మీ కోసం వచ్చాను" అని కొన్నాళ్ళ క్రితం వరకూ సినిమాకు 50కోట్ల ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను అని అనే పవన్ తాజాగా రోజుకు రెండు కోట్ల ఆదాయం తాను సినిమాల్లో నటిస్తే వస్తుంది అని అన్నారు. కానీ ఇలాంటి మాటలు ఆయనపై సామాన్య జనంలో సానుభూతిని రప్పించే అవకాశం ఉండదని తెలుసుకోవడం లేదు. ఇప్పటి ట్రెండ్ ప్రకారం అయితే ఎవరు అంత ఆదాయం వదులుకుని రమ్మన్నారు అని కౌంటర్ లు పడతాయి తప్ప పవన్ ఆశయాలను గుర్తించరు. పవన్ కళ్యాణ్ అంత ఆదాయన్నిచ్చే సినిమా రంగాన్ని వదిలి మాకోసం రాజకీయాల్లోకి వచ్చాడనే ఫీలింగ్ జనం నుంచి స్వతహాగా రావాలి తప్ప .. ఆ మాట పవన్ స్వయంగా పదే పదే చెప్పడం వల్ల మంచి ఇంప్రెషన్ అయితే కలిగే అవకాశాలు లేవన్నది విశ్లేషకుల అభిప్రాయం.


గతం లో మెగాస్టార్ కూడా ఇదే మాట:


ప్రజారాజ్యం సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంతే. " మీరు రాజకీయాల్లోకి రమ్మన్నారు..నేను వచ్చేసాను" అంటూ జనం పైనే తనను గెలిపించే భారం అన్నట్టు మాట్లాడేవారు. ఇది పెద్ద బూమెరాంగ్ అయింది ఆ రోజుల్లో. ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేది పదవుల కోసం అనేది సుస్పష్టం. ప్రజలకు సేవ చేయాలనే ఆశయం ఎంతో కొంత ఉండొచ్చు.. కానీ అంతిమ లక్ష్యం అధికారమే.ఈ మోడ్రన్ పాలిటిక్స్ యుగంలో చిన్న పిల్లాడికి సైతం తెలిసిన సత్యం ఇది. కాబట్టి ఈ రకమైన మాటలు పవన్ కచ్చితంగా మార్చుకోవాల్సిందే.


KTR,జగన్ ల ను చూసైనా...


కేటీఆర్‌ అమెరికాలో ఉద్యోగం చేసుకునే సమయంలో రాజకీయాల్లో రావాలని తెలంగాణ మూమెంట్‌ను వేదికగా చేసుకుని ఎంట్రీ ఇచ్చారు. అంత ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా జనం తనను రావాలని కోరారు..అందుకే అమెరికాలో ఉద్యోగం వదిలి వచ్చేశా లాంటి మాటలు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. జగన్ కూడా "ఓదార్పు యాత్ర చేస్తా..ముఖ్యమంత్రి అవుతా.. రాజన్న బిడ్డను ఆశీర్వదించండి " అన్నారు గానీ మీ కోసం బిజినెస్‌లు వదిలేసి వచ్చేశా లాంటి మాటలు మాట్లాడలేదు. వాళ్ళ లక్ష్యం ఏంటో ప్రజలకూ...వాళ్లకూ క్లారిటీ ఉంది. అధికారం కోసమే ఇదంతా అనే స్పష్టత ఓటర్లకు ఎప్పుడూ ఉంది. ఈ ప్రాసెస్‌లో వాళ్ల విధానాలు..మాటతీరు... కార్యకర్తలను కలుపుకుని పోవడం (కనీసం అధికారం వచ్చే వరకైనా) లాంటివి నచ్చి జనం వారిని అందలం ఎక్కించారు. రేపు నచ్చక పోతే దించేస్తారు అంతేగానీ, జనంతో మీ కోసమే అన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాము లాంటి డైలాగ్స్ చెప్పలేదు. 


చివరికి నారా లోకేష్ సైతం తమ ఓటమికి తమదే బాధ్యత అన్నారు గానీ.. జనాన్ని తప్పు బట్టే ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పటికీ జగన్ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయి..కాబట్టి నెక్స్ట్ తమకు అవకాశం ఇవ్వమని అంటున్నారే తప్ప..మీకోసం రాజకీయాల్లోకి వచ్చినా ఓడించారు లాంటి మాటలు పొరబాటున కూడా వాడట్లేదు. పవన్ మిస్ అవుతున్న పాయింట్ ఇదే.


సినిమాలు చేసినా..మానినా..జనానికి తేడా ఉండదు పవన్ జీ
 
1983లో అప్పటికీ నెంబర్ వన్ హీరోగా ఉన్న ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం తనను ఇంత ఆదరించిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి వస్తున్నట్లు చెప్పారు తప్ప.. ఏ నాడూ .."మీ కోసమే సినిమాలు వదిలేసి వచ్చాను.." లాంటి మాటలు మాట్లాడలేదు. కెరీర్ లానే పాలిటిక్స్ కూడా ఒక ఇండివిడ్యువల్ చాయిస్ . ఎవరికి ఇష్టం అయితే వారు వస్తారు తప్ప.."మీ కోసం అది వదిలేసా.. నేను సినిమాలే చేస్తే ఇంత డబ్బు సంపాదిస్తా లాంటి మాటలు" ప్రజాజీవితంలో సరికావని జనసేనాని ఎంత తొందరగా గుర్తిస్తే పార్టీకి అంత బలం అనేది విశ్లేషకుల అభిప్రాయం.