World Recession :   అమెరికాలో  ద్రవ్యోల్బణం భారీగాపెరుగుతోంది.  గ్యాస్‌, ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులు, సేవల ధరలు గణనీయంగా పెరగడంతో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరింది. వార్షిక ప్రాతిపదికన మే నెలలో ధరలు 8.6 శాతం పెరిగినట్లు అక్కడి ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 1981 తర్వాత ఈ స్థాయిలో ధరలు ఎగబాకడం ఇదే తొలిసారి.దీంతో వడ్డీరేట్ల పెంపు విషయంలో ఫెడరల్‌ రిజర్వు మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం ఇంధన, వస్తువుల ధరలేగాక ధరల పెరుగుదల అన్ని రంగాలకూ విస్తరించినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మూలంగా తలెత్తిన సరఫరా వ్యవస్థలోని ఇబ్బందుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను మరింత వేగంగా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రుణాలు భారమై ఆర్థిక మాంద్యానికీ దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 


ఆర్థిక మాంద్యం ముంగిట ప్రపంచం ! 


ఆర్థిక నిపుణులు సామాజిక శాస్త్రవేత్తలు అంతా ఊహించినట్టే జరుగుతోంది. దేశాలకు దేశాలే ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. మరోసారి ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని ఇంకా ప్రపంచ దేశాలు అప్పుడే మర్చిపోలేదు. ఇప్పుడు అదే తరహాలో  ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతోందనే ఆర్థిక నిపుణుల హెచ్చరికలు అందరిలోనూ ఆందోళన పెంచుతున్నాయి. అందులోనూ ఏకంగా 69 దేశాలు ఆర్థిక మాంద్యం ముంగిట ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా ఒక పక్క... రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో పక్క ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అప్పుల కోసం భారీగా వడ్డీల చెల్లింపుకు దిగాల్సి వస్తోంది.


ఇప్పటికే రుణ సంక్షోభంలో 60కిపైగా దేశాలు !


 
లాటిన్ అమెరికా దేశాలు ఆఫ్రికా దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. సాధారణంగానే ఆ దేశాల్లో అస్తవ్యస్త పాలన స్థిరత్వం లేని ప్రభుత్వాలు సైనిక జోక్యాలు విపరీతమైన అవినీతి ఎక్కువ. ఇప్పుడు వీటికి పులి మీద పుట్రలా గత రెండేళ్లుగా కోవిడ్ సృష్టించిన సంక్షోభం ప్రస్తుత ఉక్రెయిన్ - రష్యా యుద్ధం దాపురించాయి. దీంతో ఇంధన ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లెక్కకు మిక్కలి అప్పులు తీవ్ర నిరుద్యోగం ఆర్థిక వృద్ధి మందగమనం అధిక ద్రవ్యోల్బణం లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాల పుట్టి ముంచుతోంది. ఆఫ్రికాలో 25 దేశాలు,ఆసియా పెసిఫిక్ లో 25 దేశాలు,ఆఫ్రికాలో 19 దేశాలు  శ్రీలంక తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాల్లో 170 కోట్ల జనాభా ఉన్నారు. వారంతా ఆర్థిక మాంద్యం కష్టాలను ఎదుర్కొంటున్నారు. శ్రీలంకకు పొరుగున ఉన్న మన దేశంలో అప్పుల్లో ఎవరికీ తీసిపోలేదు. వరుస ఆర్థిక సంక్షోభాలు మనల్ని వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. శ్రీలంకతో సమానంగా అప్పుల్లో మునిగిపోయాయి. జనాకర్షణ పథకాలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని బ్యూరోక్రాట్లు హెచ్చరిస్తున్నారు.. 
 
ఈ ఏడాది చివరికి మాంద్యం ముంచుకొస్తుందా? 


2022 ఆఖరుకు ప్రపంచం దివాలా తీస్తుందన్నవిశ్లేషణల నడుమ సత్వర చర్యలపై దృష్టి పెట్టాల్సి ఉంది. చైనా, కబంద హస్తాల్లో చిక్కుకుని శ్రీలంక విలవిడలాడుతున్న తరుణంలో మరో దేశం అలాంటి పరిస్థితిని ఎదుర్కోకుండాచూడాలి. అప్పులిచ్చే దేశాల్లో చైనా అగ్రభాగాన ఉంది. చైనా విధించే షరతులతో రుణ గ్రహీతలు నిలువు దోపిడీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. అందుకే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు చైనా బారిన పడకుండా చూసుకోవాల్సి ఉంది. ప్రపంచ దేశాలకు ఈ ఏడాది నిజంగా గండమే . దాని నుంచి కాపాడుకునే సమర్థత ప్రభుత్వాల దగ్గర ఉంది.  కానీ పరిస్థితులు అనుకూలిస్తాయా అనేదే సందేహం!