పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కాదు.. చివరికి పాకిస్తాన్ మంత్రులు కూడా అదే మాదిరిగా ఆలోచిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌ను దింపేయాలని చూస్తే ప్రతిపక్ష సభ్యులందర్నీ మానవ బాంబుగా మారి  హత మార్చేస్తానని పాకిస్తాన్ విమానయాన మంత్రి నేరుగా హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇస్లాంలో మానవబాంబుగా మారడం తప్పు అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్‌ను దింపేయడానికి ప్రయత్నం చేస్తే తాను అదే పని చేస్తానని మంత్రి గులామ్ సర్వార్ ఖాన్ నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. 


 






ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని  అసమ్మతి తీర్మానం ప్రవేశపెట్టాయి. పీఎంఎల్‌– నవాజ్, పీపీపీ పార్టీలకు చెందిన 100మంది సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. పాక్‌ ప్రజల కోసమే ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అంతే కాదు ఇమ్రాన్ ఖాన్‌ను దించేసిన తర్వాత  తమలో ఎవరు పదవిని అధిరోహించాలనే విషయంపై చర్చలు జరుపుతున్నారు.  ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇమ్రాన్‌ సొంత పార్టీ టీఐఐకి 155మంది సభ్యులుండగా మరో ఆరు చిన్నపార్టీలు, ఒక స్వతంత్రుడు మద్దతిస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటికీ కలిపి 163 మంది సభ్యులున్నారు. అధికార కూటమి నుంచి 28మందికి పైగా సభ్యులు తమకు మద్దతిస్తారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. మార్చి ఇరవై రెండో తేదీన ఓటింగ్ జరగనుంది. 



పరిణామాలు కాస్త తీవ్రంగానే ఉండటంతో ... ఇమ్రాన్ ఖాన్ తో సహా మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. విపక్షపార్టీలన్నీ అమెరికాతో చేతులు కలిపాయని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. 
అంతే కాదు... అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే.. తమ పార్టీకి చెందిన పది లక్షల మంది ఇస్లామాబాద్‌ను మట్టడిస్తారని హెచ్చరించారు. ఇమ్రాన్ తో పాటు ఇతర మంత్రులు కూడా ప్రతిపక్ష సభ్యుల ఇళ్లపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. వీరందరితో పాటు... గులామ్ సర్వార్ ఖాన్ మానవబాంబు ప్రకటన హైలెట్ అవుతోంది.గులామ్ సర్వార్ ఖాన్ .. తాలిబన్లకు మద్దతిచ్చే పార్టీ నుంచి  ఎంపీగా గెలిచారు.