Russia's Space Agency Chief: అర గంటలో నాటో దేశాల కథ ముగిస్తాం: రష్యా సంచలన వ్యాఖ్యలు

ABP Desam   |  Murali Krishna   |  09 May 2022 11:54 AM (IST)

Russia's Space Agency Chief: రష్యా అణు యుద్ధం ప్రారంభిస్తే అర గంటలో నాటో దేశాల కథ ముగిస్తామని ఆ దేశ స్పేస్ ఏజెన్సీ చీఫ్ హెచ్చరించారు.

అర గంటలో నాటో దేశాల కథ ముగిస్తాం: రష్యా సంచలన వ్యాఖ్యలు

Russia's Space Agency Chief:  రష్యా విక్టరీ డే వేడుకల వేళ ఆ దేశ నేతల వ్యాఖ్యలు ప్రపంచాన్నే కలవర పెడుతున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కనుక అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ కేవలం అరగంటలో పూర్తిగా ధ్వంసమైపోతాయని ఆయన హెచ్చరించారు.

శత్రువు (పశ్చిమ దేశాలు)ను ఓడించడమే పుతిన్ లక్ష్యం. నాటో మాపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోంది. మేం కనుక అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ అర గంటలోనే ధ్వంసమైపోతాయి. మాకు ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే అణు యుద్ధం కారణంగా ప్రపంచ పరిణామాలతో పాటు భూమి వాతావరణమే మారిపోతుంది. అది మాకు ఇష్టం లేదు. అందుకే శత్రువును ఆర్థిక, సైనిక చర్యలు, సంప్రదాయ యుద్ధాలతోనే ఓడిస్తాం.                                       - దిమిత్రి రోగోజిన్‌, రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్

విక్టరీ డే

1945లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ఈసారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుండటంతో విక్టరీ డేకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బాంబు దాడి

లుహాన్సక్​లోని బిలోహోర్వికా ప్రాంతంలో ఉన్న పాఠశాలపై రష్యా సైనికులు ఆదివారం బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 60 మంది వరకు మృతి చెందారు. ఈ దాడి జరిగిన సమయంలో భవనంలో 90 మంది ఉండగా 27 మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిన్నట్లు లుహాన్సక్‌ గవర్నర్ తెలిపారు.

మేరియుపొల్‌ నగరంపై రెండ్రోజులుగా దాడుల తీవ్రత పెరగడంతో అక్కడ బలగాలను కట్టుదిట్టం చేశాయి. ఈ రెండ్రోజుల్లో రష్యా మరింతగా విరుచుకుపడే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ అంచనాలను నిజం చేస్తూ రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది. 

భద్రతా మండలి

మరోవైపు ఉక్రెయిన్‌లో శాంతి, భద్రతలకు సంబంధించిన పరిస్థితులపై ఐరాస భద్రతా మండలి ఆందోళన వ్యక్తంచేసింది. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి. యుద్ధం, ఘర్షణ అనే పదాలను వాడకుండా.. ఐరాసలోని సభ్య దేశాలన్నీ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని హితవు పలికింది.

Also Read: Covid Update: దేశంలో కొత్తగా 3,207 కరోనా కేసులు- 29 మంది మృతి

Also Read: Loudspeaker Row: కర్ణాటకలో హై అలర్ట్- 'హనుమాన్ చాలీసా vs అజాన్'- పోలీసులు పరేషాన్!

Published at: 09 May 2022 11:47 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.