Loudspeaker Row: కర్ణాటకలో హై అలర్ట్- 'హనుమాన్ చాలీసా vs అజాన్'- పోలీసులు పరేషాన్!

ABP Desam Updated at: 09 May 2022 10:49 AM (IST)
Edited By: Murali Krishna

Loudspeaker Row: కర్ణాటకలో హనుమాన్ చాలీసా vs అజాన్ వివాదం నడుస్తోంది. మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

కర్ణాటకలో హై అలర్ట్- 'హనుమాన్ చాలీసా vs అజాన్'- పోలీసులు పరేషాన్!

NEXT PREV

Loudspeaker Row: కర్ణాటక హైఅలర్ట్‌లో ఉంది. హిందూ కార్యకర్తలు అజాన్‌ (ముస్లింల ప్రార్థన)కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసాను పఠిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముథాలిక్ ఈ కార్యక్రమాన్ని మైసూర్ జిల్లాలోని ఓ ఆలయంలో ఈరోజ తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభించారు. మసీదుల్లోని అజాన్‌కు వ్యతిరేకంగా దాదాపు 1000 ఆలయాల్లో ఈరోజు హనుమాన్ చాలీసా, సుప్రభాతాన్ని వినిపిస్తామని ఆయన అన్నారు.


సీఎంకు సవాల్


ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ చూపించిన తెగువను కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర ప్రదర్శించాలని ప్రమోద్ కోరారు. ఇటీవల యూపీలో అనుమతి లేని లౌడ్‌ స్పీకర్లను తొలిగించి, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోని లౌడ్ స్పీకర్ల సౌండ్ తగ్గించాలని యోగి ఆదేశించారు.  


అరెస్ట్‌లు


హనుమాన్ చాలీసా పఠించడానికి సిద్ధమైన పలువురు హిందూ కార్యకర్తలను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. దీని వల్ల రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను వివరించేందుకు సీఎం బసవరాజ్ బొమ్మైను బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ కాంత్ కలిశారు.


కఠిన చర్యలు


రాష్ట్రంలో ఎవరైనా లౌడ్‌ స్పీకర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి హెచ్చరించారు. ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలు అందరూ పాటించాలని కోరారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఎలాంటి కఠిన చర్యలైనా చేపడతామన్నారు.


లౌడ్ స్పీకర్లపై ఇప్పటివరకు మొత్తం 301 నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. నగరంలోని 59 పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, 12 పరిశ్రమలు, 83 ఆలయాలు, 22 చర్చిలు, 125 మసీదులకు ఈ నోటీసులు పంపించారు. మల్లేశ్వరంలోని మరిన్ని ఆలయాలకు కూడా ఈ నోటీసులు పంపింది ప్రభుత్వం.


మరింతగా


రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ముథాలిక్ తెలిపారు. అజాన్‌పై ప్రభుత్వం చర్యలు చేపట్టేవరకు తమ నిరసన కొనసాగిస్తామన్నారు.



రోజూ తెల్లవారుజామున మసీదుల నుంచి వినిపించే అజాన్ వల్ల రోగులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చట్టాల కంటే తామే శక్తిమంతమైన వాళ్లు అనే విధంగా ముస్లింలు ఫీల్ అయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ చట్టాని కన్నా ఎవరూ ఎక్కువ కాదు.                                                                      - ప్రమోద్ ముథాలిక్, శ్రీరామ సేన వ్యవస్థాపకుడు


వరుస వివాదాలు


ప్రస్తుతం కర్ణాటక వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హిజాబ్ వివాదం, భజరంగ్ దళ్ కార్యకర్తల హత్య, హుబ్బళి మత ఘర్షణలతో కర్ణాటక పోలీసులకు వరుస సవాళ్లు ఎదురయ్యాయి.

Published at: 09 May 2022 10:38 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.