Israel Hamas Attack: 


టాయిలెట్స్‌ డోర్స్‌పై కాల్పులు..


అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టారు. గాజాలో ఓ మ్యూజిక్ ఫెస్ట్‌పైనా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కొంత మందిని కిడ్నాప్ చేశారు. మరి కొందరిని అక్కడికక్కడే కాల్చి చంపారు. అప్పటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7న గాజాలో ఓ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఆ ఫెస్ట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఏ ఒక్కరూ ప్రాణాలు లేకుండా అందరినీ వెతికి వెతికి మరీ చంపారు. ఎంత దారుణం అంటే...టాయిలెట్స్‌లో ఎవరైనా ఉంటే బతికిపోతారని, అందులో దాక్కుని ఉంటారని అనుమానంతో వాటి డోర్స్‌పైనా బులెట్ల వర్షం కురిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు అందులో ఎవరైనా ఉన్నారా లేదా అన్నది కూడా చూడకుండా తుపాకులతో కాల్చుకుంటూ వెళ్లారు. Israel Defence Force (IDF) ఈ వీడియోని విడుదల చేసింది. ఎవరినీ లెక్క చేయకుండా ఇలా కాల్చి పారేస్తున్నారంటూ ట్వీట్ చేసింది. ఈ కాల్పుల్లో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. టాయిలెట్‌ డోర్స్‌ అన్నీ రక్తంతో తడిసిపోయాయి. ఆ రక్తాన్ని కళ్లారా చూశాక కానీ అక్కడి నుంచి వెళ్లిపోలేదు ఉగ్రవాదులు. ఈ కాల్పుల మోత చాలా దూరం వరకూ వినిపించిందని స్థానికులు చెప్పారు. హమాస్ ఉగ్రదాడుల తరవాత ఇజ్రాయేల్‌లో దాదాపు 1,300 మంది చనిపోయారు. గాజాలో 1,900 మంది పౌరులు బలి అయ్యారు. వీరిలో 600 మంది చిన్నారులే ఉన్నారు. 






హమాస్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ హతం..
 
హమాస్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మురద్ అబు మురద్‌ని (Murad Abu Murad) మట్టుబెట్టింది ఇజ్రాయేల్ సైన్యం. అర్ధరాత్రి జరిగిన ఎయిర్‌ స్ట్రైక్‌లో మురద్‌ మృతి చెందాడు. లెబనాన్‌ నుంచి ఇజ్రాయేల్‌లోకి చొచ్చుకునేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నించారని వెల్లడించింది మిలిటరీ. వాళ్లందరిపైనా దాడులు చేసింది. 


"గాజాలోని హమాస్ ఆపరేషనల్ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయేల్ ఎయిర్‌ ఫోర్స్‌ దాడులు చేసింది. ఇక్కడి నుంచే ఇజ్రాయేల్‌పై ఎయిర్‌ స్ట్రైక్‌లు ప్లాన్ చేశారు. అందుకే..ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఈ దాడుల్లో హమాస్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మురద్ అబు మురద్‌ హతమయ్యాడు"


- ఇజ్రాయేల్‌ ఎయిర్‌ ఫోర్స్ 


హమాస్ దాడులపై మరోసారి (Israel Hamas Attack) తీవ్రంగా స్పందించారు ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu). గాజాపై చేస్తున్న దాడులు కేవలం "ఆరంభం" మాత్రమే అని స్పష్టం చేశారు. మున్ముందు దాడుల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. వేలాది మంది ఇజ్రాయేల్ బలగాలు గాజాను చుట్టుముట్టాయి. సొరంగాల్లో నక్కి ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నాయి. బంకర్లనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహు ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. రానున్న రోజుల్లో శత్రువుల మరింత భారీ మూల్యం చెల్లించుకుంటారని తేల్చి చెప్పారు. హమాస్‌ని పూర్తిగా అంతం చేస్తామని శపథం చేశారు నెతన్యాహు. 


Also Read: ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా, వేలాది మందికి బెన్‌ఫిట్