విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అనేక సందర్భాలలో పశ్చిమ దేశాల తీరును ఎండగట్టారు. రష్యా- ఉక్రెయిన్ సమస్యపై ఆయన స్పందన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు జైశంకర్‌. న్యూయార్క్‌ వేదికగా... గ్లోబల్ నార్త్‌లోని ఆధిపత్య దేశాలపైనే పరోక్షంగా చరకలు వేశారాయన. ఇది ఇప్పటికీ ద్వంద్వ  ప్రమాణాల ప్రపంచమే అని... ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్న దేశాలు మార్పు కోసం ఒత్తిడిని ప్రతిఘటిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. చారిత్రక ప్రభావం  ఉన్న వ్యక్తులు ఆ సామర్థ్యాలను తమ ఆయుధాలుగా చేసుకున్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి, UN ఇండియా మరియు రిలయన్స్ ఫౌండేషన్‌లో భారతదేశ శాశ్వత మిషన్  సహకారంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన 'సౌత్ రైజింగ్: పార్ట్‌నర్‌షిప్‌లు, ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఐడియాస్' అనే పేరుతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జైశంకర్  మాట్లాడారు. మార్పు కోసం రాజకీయ సంకల్పం కంటే... రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందని భావిస్తున్నానని చెప్పారు.


ఆధిపత్య స్థానాల్లో ఉన్న దేశాలు మార్పును ప్రతిఘటిస్తున్నాయని అన్నారు జైశంకర్‌. UN భద్రతా మండలిలో ఇలాంటి తీరును ఎక్కువగా గమనిస్తుంటామని చెప్పారు. ఆర్థిక  ఆధిపత్యం ఉన్నవారు తమ ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటున్నారని, సంస్థాగత లేదా చారిత్రక ప్రభావం ఉన్నవారు ఆ సామర్థ్యాలను ఆయుధాలుగా  చేసుకుంటారని అన్నారు. వారు సరైన విషయాలే చెప్తారు.. కానీ నిజమేంటి అంటే... ఇది చాలా ద్వంద్వ ప్రమాణాల ప్రపంచం అంటూ సెటైర్‌ వేశారు జైశంకర్‌. ఇందుకు కోవిడే  ఒక ఉదాహరణ అని చెప్పారు.


సంపూర్ణ పరివర్తనలో తేవడంలో అంతర్జాతీయ వ్యవస్థపై, గ్లోబల్ నార్త్‌పై... గ్లోబల్ సౌత్ మరింత ఒత్తిడి తెస్తోందని... అయితే ఉత్తరాది అడ్డుకుంటోందన్నారు. ఉత్తరాది మాత్రమే  కాదు... అలాంటి అనేక దేశాలు దీనిని అడ్డుకుంటున్నాయని చెప్పారాయన. ఎవరూ తమను తాము ఉత్తరంలో భాగంగా భావించడంలేదన్నారు. గ్లోబల్ నార్త్ అనే పదాన్ని  అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయోగిస్తారని చెప్పిన జైశంకర్‌... వీటిలో ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  ఉన్నాయన్నారు. గ్లోబల్ సౌత్ అనే పదాన్ని అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందని దేశాలకు ఉపయోగిస్తారని.. వీటిలో ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా మరియు  లాటిన్ అమెరికాలో ఉన్నాయి. భారతదేశం దాని నాయకుడిగా పరిగణించబడుతుందని చెప్పారు.


సాంస్కృతిక రీబ్యాలెన్సింగ్ అంటే ప్రపంచంలోని వైవిధ్యాన్ని గుర్తించడం, గౌరవించడమే కాదు... ఇతర సంస్కృతులు, సంప్రదాయాలకు తగిన గౌరవం కూడా ఇవ్వాలన్నారు.  ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సును ప్రస్తావించిన జైశంకర్.. మినుములను ఉదాహరణగా చూపారు. గ్లోబల్ సౌత్ చారిత్రాత్మకంగా తక్కువ గోధుమలు, ఎక్కువ మిల్లెట్లను తినేదని  చెప్పారు. ఇతరుల వారసత్వం, సంప్రదాయం, సంగీతం, సాహిత్యం, జీవన విధానాలను గౌరవించడం.. గ్లోబల్ సౌత్ చూడాలనుకుంటున్న మార్పులో భాగమన్నారు జైశంకర్.  రుణాలు, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్.. SDG రీసోర్సింగ్, క్లైమేట్ యాక్షన్ రీసోర్సింగ్, డిజిటల్ యాక్సెస్, న్యూట్రిషన్, జెండర్ అనేవి... మొత్తం ప్రపంచాన్ని  కలవరపెడుతున్న ప్రధాన సమస్యలని చెప్పారు జైశంకర్. కరోనా, ఉక్రెయిన్‌పై దృష్టి సారించడం వల్ల... ఈ విషయాలను ప్రపంచస్థాయిలో పెద్దగా ప్రస్తావించలేదన్నారు. ఢిల్లీలో  జరిగిన జీ20 సదస్సులో కూడా గ్లోబల్ సౌత్‌పై దృష్టి సారించామని చెప్పారాయన.