Sheikh Hasina Resigned: 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది.  ఆ సమయంలో బంగ్లాదేశ్ పరిస్థితి పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంది, కానీ రాజకీయ పరిస్థితులు మాత్రం దాదాపు అలాగే ఉన్నాయి. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి జరిగిన ఎన్నికలలో కేవలం 4 ఎన్నికలు మాత్రమే స్వేచ్ఛగా, న్యాయంగా జరిగాయి. బంగ్లాదేశ్ లో తరచూ ఎన్నికల సమయంలో హింస, నిరసనలు, ఓటింగ్ రిగ్గింగ్ ఆరోపణలు ఉంటూనే ఉంటాయి. బంగ్లాదేశ్‌లో గత నెల రోజులుగా సాగుతున్న రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలు ఎప్పటికి ముగుస్తాయో తెలియని పరిస్థితి.  ఈ నిరసనలు ప్రధాని షేక్ హసీనాను అధికారం నుండి తొలగించాయి. సైన్యం దేశానికి నాయకత్వం వహించింది.


దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆర్మీ చీఫ్ చెప్పారు. మరోవైపు, తిరుగుబాటు ముప్పు కారణంగా షేక్ హసీనా మరోసారి తన దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే.. హింసాకాండ నేపథ్యంలో షేక్ హసీనా రాజధాని ఢాకా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భారత్‌లోని సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. షేక్ హసీనా అగర్తలాలో దిగినట్లుగా త్రిపుర పోలీసులు తెలిపారు. షేక్ హసీనాతో పాటు ఆమె 76 ఏళ్ల చెల్లెలు షేక్ రెహానా కూడా ఉన్నారు. త్రిపురలోని అగర్తల నుంచి షేక్ హసీనా లండన్ వెళ్తున్నట్లు సమాచారం.


నియంత పాలన మొదలు 
పాకిస్తాన్ నుండి విడిపోయిన తరువాత బంగ్లాదేశ్‌లో మొదటిసారిగా మార్చి 7, 1973న సాధారణ ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన షేక్ ముజిబుర్ రెహమాన్ అధ్యక్షతన జరిగిన అవామీ లీగ్ ఎన్నికలలో విజయాన్ని సాధించింది. దేశంలో ప్రజలు అత్యంత ఇష్టపడే పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అవామీ లీగ్ ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడిందని, ప్రతిపక్ష నాయకులను కిడ్నాప్ చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపణలు వచ్చాయి.  అవామీ లీగ్ పార్లమెంటులో 300 సీట్లకు 293 గెలుచుకుంది. ఇది ఏకపక్ష విజయం. ఈ పెద్ద విజయంతో బంగ్లాదేశ్‌లో నిరంకుశ పాలన మొదలైంది. 1974లో ప్రధానమంత్రి ముజిబుర్ రెహమాన్ దేశంలో ఒక రకమైన నియంతృత్వానికి నాంది పలికి అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు చాలా మంది పత్రికా ప్రతినిధులను పార్లమెంటు నుండి నిషేధించారు. అయితే, ముజీబుర్ రెహమాన్ తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. 3 సంవత్సరాల 13 రోజుల తరువాత సైన్యం తిరుగుబాటు చేసింది.


హత్యకు దారితీసిన తిరుగుబాటు 
ఆగస్ట్ 15, 1975న బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన కొందరు జూనియర్ అధికారులు షేక్ ముజీబ్ ఇంటిపై ట్యాంక్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ముజీబ్‌తో పాటు అతని కుటుంబం, భద్రతా సిబ్బంది మరణించారు. ఆ సమయంలో జర్మనీకి వెళ్లినందున అతని ఇద్దరు కుమార్తెలు షేక్ హసీనా, షేక్ రెహానా మాత్రమే బతికారు. ఆమె తండ్రి హత్య తర్వాత, షేక్ హసీనా తన కుటుంబంతో భారతదేశానికి వచ్చేశారు. అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆమెకు భారతదేశంలో ఆశ్రయం ఇచ్చింది. అయితే ఆ సమయంలో భారతదేశంలో ఎమర్జెన్సీ ఉంది. సుమారు ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్న తర్వాత, షేక్ హసీనా తన కుటుంబంతో 1981లో ఢాకాకు తిరిగి వెళ్లారు.  ఆ సమయంలో ఆమెకు అక్కడ ఘన స్వాగతం లభించింది.   


జియావుర్ రెహ్మాన్ నేషనలిస్ట్ పార్టీ స్థాపన
1975లో ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురైనప్పుడు, బంగ్లాదేశ్ సైన్యం తరువాతి దశాబ్దంన్నర పాటు అధికారం చేపట్టింది. మాజీ ఆర్మీ చీఫ్ జియావుర్ రెహమాన్ నాయకత్వంలో 1978 - 1979 మధ్య ప్రెసిడెంట్, పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కొత్తగా ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అత్యధిక మెజారిటీని సాధించింది.  


మరొక తిరుగుబాటు, జియావుర్ రెహ్మాన్ హత్య
1981 సంవత్సరంలో జియావుర్ రెహ్మాన్ హత్య తర్వాత అతని డిప్యూటీ అబ్దుస్ సత్తార్ నవంబర్ 15న సాధారణ ఎన్నికలను నిర్వహించారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మళ్లీ 65 శాతం ఓట్లతో విజయం సాధించింది. మాజీ ఆర్మీ చీఫ్ హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ 1982లో తిరుగుబాటులో అధికారాన్ని చేపట్టారు. తర్వాత కూడా అతని పార్టీ 7 మే 1986న జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో.. 15 అక్టోబర్ 1986న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఓట్ల లెక్కలను ఎక్కువగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి.   


మరో సారి నిరసలు  
1988లో హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్‌ను అధికారం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో మళ్లీ పెద్ద నిరసనలు జరిగాయి. ఫలితంగా 1990లో ప్రజా తిరుగుబాటు కారణంగా హుస్సేన్ ఎర్షాద్ రాజీనామా చేయవలసి వచ్చింది. 27 ఫిబ్రవరి 1991న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి షహబుద్దీన్ అహ్మద్ నేతృత్వంలో  ప్రధాన పార్టీలు ఎన్నికలలో పాల్గొన్నాయి. జియావుర్ రెహమాన్ పార్టీ బీఎన్పీ విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ 140 సీట్లు గెలుచుకోగా, అవామీ లీగ్ 88 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.


షేక్ హసీనా తొలిసారి ప్రధాని  
దీని తర్వాత 1996లో జరిగిన ఎన్నికలను బంగ్లాదేశ్‌లోని దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి, అయితే ఏ ప్రత్యర్థి లేకుండానే బీఎన్పీ గెలిచింది. జూన్ 12, 1996న బంగ్లాదేశ్‌లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి 75 శాతం మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు . ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయి. షేక్ హసీనా తన తండ్రి కోల్పోయిన వారసత్వాన్ని స్వాధీనం చేసుకోవడానికి సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసింది. చివరికి 1996లో మొదటిసారి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆమె నాయకత్వంలో అవామీ లీగ్ 146 సీట్లు గెలుచుకోగా, ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ 116 సీట్లు గెలుచుకుంది.


షేక్ హసీనా ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపారు, కానీ ఆమె పార్టీ 2001లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో బీఎన్‌పీ భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని నడిపింది. కానీ దీని తర్వాత 2006లో జరగాల్సిన ఎన్నికలను సకాలంలో నిర్వహించలేకపోయారు. బంగ్లాదేశ్ దాదాపు రెండేళ్లపాటు రాజకీయ సంక్షోభంలో ఉంది. ఈ సమయంలో హింస, అల్లర్లు, అనేక ప్రదర్శనలు కొనసాగాయి. 2008లో అధ్యక్షుడు ఇయాజుద్దీన్ అహ్మద్ బంగ్లాదేశ్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు, సైన్యం జోక్యం చేసుకుంది.. అవామీ లీగ్ నిరసనగా ఎన్నికల నుండి వైదొలిగింది.



రాజకీయ సంక్షోభం తర్వాత తిరిగి వచ్చిన హసీనా 
చివరగా 29 డిసెంబర్ 2008న బంగ్లాదేశ్‌లో మరోసారి ఎన్నికలు జరిగాయి. ఇందులో 80 శాతం ఓటింగ్ జరిగింది. ఈసారి అవామీ లీగ్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసింది.  దానికి షేక్ హసీనా నాయకత్వం వహించారు. అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 48 శాతం ఓట్లతో భారీ విజయం సాధించింది. జనవరి 2009లో షేక్ హసీనా మరోసారి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి అయ్యారు. 2018లో తొలిసారిగా బంగ్లాదేశ్‌లో EVMలను ఉపయోగించి ఎన్నికలు జరిగాయి.  సార్వత్రిక ఎన్నికలను రిగ్గింగ్ చేశారని ప్రధానమంత్రి షేక్ హసీనాపై ఆరోపణలు చేశాయి. ఎన్నికలకు సంబంధించిన తప్పుడు వార్తలను అరికట్టాలని హసీనా ప్రభుత్వం ఎన్నికల రోజుకు ముందు మొబైల్ ఇంటర్నెట్‌ను మూసివేసింది. ఈ ఎన్నికల్లోనూ షేక్ హసీనా నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమి రికార్డు స్థాయిలో విజయం సాధించి షేక్ హసీనా ప్రధాని అయ్యారు.


 ఈ సంవత్సరం ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా పార్టీ రిగ్గింగ్ ఆరోపణలు ఎదుర్కొంది. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. షేక్ హసీనా గెలుచుకుంది. షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు.   ఇప్పుడు బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాపై వ్యతిరేకత, రిజర్వేషన్ల మంటతో, ఐదుసార్లు ప్రధానమంత్రి అయిన వెంటనే దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది. బంగ్లాదేశ్ పగ్గాలు మరోసారి సైన్యం చేతుల్లోకి వెళ్లింది. పస్తుత పరిస్థితుల్లో ఖలీదా జియా పార్టీ బీఎన్పీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి స్థిరపడి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, రాబోయే కాలంలో బంగ్లాదేశ్‌లో ఎప్పుడు నిష్పక్షపాతంగా   ఎన్నికలు జరుగుతాయో..  ప్రజలు ఏ పార్టీని విశ్వసిస్తారో చూడాలి.


ప్రధానిపై ప్రజలు ఎందుకు తిరగబడ్డారు?
ఉద్యోగ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనకు దిగారు. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలకు 30శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. కానీ మహిళలకు 10శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. వెనుకబడిన జిల్లాల్లో నివసించే వారికి జిల్లా కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు ఇస్తారు. కానీ మైనారిటీలకు మతం ఆధారంగా 5శాతం రిజర్వేషన్లు ఇస్తారు. వికలాంగులకు ఒక శాతం రిజర్వేషన్‌ కల్పించారు. 2018లో నిరసనల తర్వాత  ప్రభుత్వం ఈ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయం తప్పని ఈ ఏడాది జూన్‌లో హైకోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు తర్వాత దేశంలో మళ్లీ ఈ విధానం అమల్లోకి రానుంది. దీనిపై బంగ్లాదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి.