ప్రపంచంలో అత్యంత సంపన్న ప్రజాస్వామ్య దేశాల కూటమి జీ7. ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల అధినేతలు ప్రపంచ స్థాయి అంశాలపై సవివరంగా చర్చిస్తారు. 


ఈ ఏడాది జీ7 సదస్సు జూన్​లో ముగిసింది. ఈ భేటీలో ముఖ్యంగా చైనా దుర్మార్గాలకు చెక్​ పెట్టేలా జీ7 దేశాలు స్కెచ్ వేశాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన, కరోనా వైరస్, వ్యాక్సిన్ వంటి విషయాలపై దేశాధినేతలు మాట్లాడారు.


జీ7 హైలైట్స్​..


చైనాకు చెక్..


చైనా పెత్తనానికి అడ్డుకట్ట వేసేందుకు జీ7 కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా నుంచి పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలు జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


కరోనాపై



  1. భవిష్యత్తులో కరోనా వంటి ముప్పు రాకుండా చర్యలు.

  2. భవిష్యత్తులో కొత్త రకం వైరస్‌ ముప్పు ఎప్పుడు బయటపడినా దాన్ని వంద రోజుల్లోనే కట్టడి చేయాలని సంకల్పం.  ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య తీర్మానం(కార్బిస్ బే) ఆమోదం.

  3. ప్రపంచ ఆరోగ్య రంగంలోనే మైలురాయి 'కార్బిస్‌ బే'.

  4. 100 రోజుల్లో వైరస్‌ ముప్పును తప్పించేందుకు జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్న బ్రిటన్‌


టీకాలు


కరోనా విజృంభణ, టీకాల కొరత నేపథ్యంలో పేద దేశాలకు ఒక బిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులు విరాళంగా ఇవ్వాలని జీ7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల టీకా డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి.


పర్యావరణ పరిరక్షణ..



  • పర్యావరణ పరిరక్షణ దిశగా కఠినమైన లక్ష్యాలను పెట్టుకోవాలని జీ7 దేశాలు నిర్ణయించాయి.

  • బొగ్గు, శిలాజ ఇంధన వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని సంకల్పించుకున్నాయి.

  • వాతావరణ మార్పులపై పోరాడేందుకు జీ7 దేశాలు అందించే నిధుల వాటాను 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయం.

  • 2010 స్థాయులతో పోలిస్తే కర్బన ఉద్గారాలను 2030 నాటికి సగానికి తగ్గించాలనే లక్ష్యం


చైనా, రష్యా ఎందుకు లేవు?


ఈ శక్తిమంతమైన కూటమిలో చైనా, రష్యా వంటి దేశాలు లేకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి.


ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగివుండటంతో పాటు రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న చైనాలో జనాభా తలసరి ఆదాయం మిగతా అభివృద్ధి చెందిన దేశాలకన్నా తక్కువ స్థాయిలో ఉంది. ఈ కారణంతోనే జీ7 దేశాల తరహాలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చైనాని పరిగణించటం లేదు.


1998లో రష్యా కూడా ఈ బృందంలో చేరింది. అప్పుడు ఇది జీ8 బృందంగా ఉండేది. కానీ.. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తన భూభాగంలో కలుపుకోవటం వల్ల 2014లో ఈ బృందం నుంచి ఆ దేశానికి ఉద్వాసన పలికారు. దీంతో ఈ బృందం మళ్లీ జీ7గా మారింది.