భారత్​, చైనా.. ఆసియాలోనే కాక ప్రపంచంలోనే రెండు పెద్ద దేశాలు. ఆర్థికంగా, సైనిక శక్తిలో వీటి శక్తిసామర్థ్యాలు అంతా ఇంతా కాదు. అయితే ఏడాదిగా ఇరు దేశాల మధ్య గల్వాన్ ఘర్షణతో యుద్ధ వాతావరణం నెలకొంది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా క్షీణించాయి. ఈ సమయంలో జరగనున్న బ్రిక్స్​ సమావేశంపై ఈ ప్రభావం ఉంటుందా? ఆసియాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనాకు భారత్ చెక్​ పెట్టనుందా?

బ్రిక్స్ (BRICS) అనేది అభివృద్ధి చెందుతున్న ఐదు ప్రపంచ దేశాల కూటమి.

బ్రిటన్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఇందులోని సభ్య దేశాలు. ఈ ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థల ఆధారంగా ఈ కూటమి ఏర్పడింది.

ప్రపంచ జనాభాలో 44 శాతం బ్రిక్స్ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జీడీపీలో 30 శాతం, వాణిజ్యంలో 18 శాతం బ్రిక్స్ దేశాల నుంచే వస్తోంది.

ఎందుకీ మీటింగ్..?

ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేతలు పాల్గొంటారు. 2009 నుంచి బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో కలుస్తున్నాయి.

చివరి మీటింగ్ ఎక్కడ..?

2020లో జరిగిన 12వ బ్రిక్స్​ సమావేశానికి రష్యా అధ్యక్షత వహించింది. కరోనా కారణంగా వర్చువల్​గా ఈ సమావేశం జరిగింది.

ఈసారి భారత్​లోనే..

ఈ ఏడాది జరిగే 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఈ సమావేశాన్ని భారత్‌లోనే నిర్వహిస్తారు. మూడవసారి భారత్​ బ్రిక్స్​ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2012, 2016లో ఈ సమావేశాలు భారత్​లోనే జరిగాయి.

భారత్​ అజెండా ఏంటి?

సాధారణంగా ఐదు సభ్య దేశాలకు ప్రయోజనకరమైన విషయాలను ఈ సదస్సులో ప్రస్తావిస్తారు. అయితే బ్రిక్స్​ దేశాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని భారత్​ ఆకాక్షిస్తుంది. కొవిడ్-19 సంక్షోభాన్ని సభ్యదేశాలన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆశిస్తుంది.

అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతా, రాజకీయ అంశాలపై బ్రిక్స్​ దేశాలు స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలని భారత్​ కోరుతోంది.

భారత్​-చైనా ఘర్షణ ప్రభావం..

ఇటీవల చెలరేగిన సరిహద్దు వివాదం, గల్వాన్​ ఘర్షణతో క్షీణించిన భారత్​-చైనా సంబంధాలు బ్రిక్స్ సమావేశంపై ప్రభావం చూపనున్నాయి. అయితే ఇరుదేశాల సంబంధాల పునరుద్ధరణకు బ్రిక్స్​ సమావేశం సహాయపడనుంది.

ఆసియాలో ఆధిపత్యానికి ఆరాడపడుతున్న చైనాకు గల్వాన్​లో భారత్​ గట్టి బదులిచ్చింది. భారత్​ను కాదని ఆసియాలో వ్యాపారాన్ని విస్తరించడం చైనాకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే భారత్​లో చైనాకు పెద్ద మార్కెట్​ ఉంది. అందుకే భారత్​తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదని చైనా భావిస్తుంది. అందుకే ఈ ఏడాది భారత్​లో జరిగే బ్రిక్స్​ సమావేశానికి డ్రాగన్ ఎలాంటి అడ్డుచెప్పలేదు. సరిహద్దు వివాదంపై బ్రిక్స్​ సమావేశంలో చైనా అడ్డగోలు మాటలు మాట్లాడితే గట్టిగా బదులిచ్చేందుకు భారత్​ సిద్ధమైనట్లు తెలుస్తోంది.  అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సభ్య దేశాల అధినేతలు ఈ ఏడాది చివరిలో భారత్​లో జరిగే సమావేశానికి వస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే వర్చువల్​గా జరిగే అవకాశమే ఎక్కువ  ఉంది.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు..

2020 బ్రిక్స్​ సమావేశంలో ప్రస్తావించిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్ కట్టుబడి ఉంది. అయితే ఇందుకోసం సరైన కార్యాచరణపై ఈ ఏడాది భేటీలో చర్చించనున్నారు.