సరైన కథల కోసం హీరోలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడంతా పాన్ ఇండియా హడావిడి నడుస్తుండడంతో అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే విధంగా కథలను ఎన్నుకుంటున్నారు. అయితే మన దగ్గర కథలు రాసేవారు తగ్గిపోతున్నారు. దీంతో మన హీరోలే ఆ కొరత తీర్చడానికి రెడీ అయిపోతున్నారు. కాస్త అనుభవం, టాలెంట్ ఉన్న హీరోలంతా కథల విషయంలో దర్శకులకు సహాయం చేస్తూ పనిభారం తగ్గిస్తున్నారు. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన వారైతే స్వయంగా కథలు రాసుకుంటున్నారు. 



ప్రస్తుతం టాలీవుడ్ లో కొంతమంది హీరోలు కథలు రాస్తున్న సంగతి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నేచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దర్శకత్వం మీద ఆసక్తితోనే ఇండస్ట్రీకి వచ్చారు. కానీ హీరోగా మారారు. అయినప్పటికీ కథల విషయంలో అతడి ఆసక్తి తగ్గిపోలేదు. దర్శకుడిగా పని చేయాలని ఉన్నా.. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేయలేరు. కానీ నిర్మాతగా మాత్రం నాని చాలా బిజీగా గడుపుతున్నారు. 
హీరోగా ఆయన చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా.. నిర్మాతగా ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం నాని నిర్మాతగా 'మీట్ క్యూట్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇది కాకుండా తన బ్యానర్ లో చేయబోయే మరో సినిమా కోసం నాని కథ రెడీ చేశారట. తన కథను బాగా డీల్ చేసే దర్శకుడి కోసం నాని వెతుకుతున్నట్లు సమాచారం. 



మరో హీరో అల్లరి నరేష్ కూడా సహాయ దర్శకుడిగా పని చేశారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ మాదిరి ఎప్పటికైనా మెగాఫోన్ పెట్టాలనేది అల్లరి నరేష్ కోరిక. అయితే ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ.. హీరోగానే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఓ కథను సిద్ధం చేశారట. ఆ కథతో తనే సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ డైరెక్షన్ మాత్రం చేయరట. ప్రస్తుతం ఈ కథ స్క్రిప్ట్ రూపంలో మారుతోందట. ఆ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తరువాత దీనిపై ప్రకటన రానుంది. 



సీనియర్ హీరో మోహన్ బాబు కూడా కథ -స్క్రీన్ ప్లే విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన తాజా సినిమా 'సన్ ఆఫ్ ఇండియా' టైటిల్ కార్డులో మోహన్ బాబు పేరుంది. మరో హీరో రవితేజ దగ్గర కూడా కొన్ని కథలు ఉన్నాయి. వాటిలో ఓ కథను ఎన్నుకొని డైరెక్షన్ చేయాలనేది రవితేజ ఆలోచన. ఇలా హీరోల్లో కొంతమంది కథలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. లాక్ డౌన్ సమయం వీరికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరి రైటర్లుగా వీరికి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!