పశ్చిమ బిహార్‌ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందబోతున్నాయి. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు. 


ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ (దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో) కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.


ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లు మొదలయ్యాయి. తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలు పలు జిల్లాల్లో తేలిక పాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లా, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. 


మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షాలు పడే జిల్లాల్లో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకే ఈ జిల్లాల్లో వాతావరణ శాఖాధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 


హైదరాబాద్ లో ఇలా
హైదరాబాద్‌లో వేకువ జాము నుంచి వర్షం కురుస్తోంది. అన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. వనస్థలిపురం, ముషిరాబాద్, సైదాబాద్‌, కుత్బల్లాపూర్‌, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో వర్షం కాస్త ఎక్కువగా ఉంది. 


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.


ఛత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతున్న  ద్రోణి కారణంగా మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి,అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.



శ్రీకాకుళం, మన్యం,విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది. అల్లూరి, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉండనున్నాయి. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి అల్లూరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశ ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా వర్షాలకు అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు.


ఇప్పటికే కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, నంధ్యాల​, కర్నూలు,  జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.