Weather Latest News: భానుడు రోజురోజూకు తీవ్రరూపం దాల్చుతుతున్నాడు. నిప్పులు కక్కుతుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండతోపాటు ఉక్కపోత, వడగాడ్పులు వీస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అల్లాడుతున్నారు. ఆదివారం కూడా భానుడు ఉగ్ర రూపం దాల్చాడు. గడిచిన కొద్దిరోజులు నుంచి రోజువారీ ఉష్ణగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.


శనివారం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 44.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదివారానికి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు నమోదు కాగా, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్‌ఆర్‌ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా అలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 40 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.


107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అంటే రాష్ట్రంలోని మొత్తం 670 మండలాలకుగాను సగానికిపైగా(342) మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఇకపోతే, సోమవారం కేవలం రెండు మండలాల్లో మాత్రమే వడగాడ్పులు వీయనున్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో మాత్రమే తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని వెల్లడించింది. మరో 93 మండలాల్లో వడగాడడ్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఆరు, విజయనగరం జిల్లాలో 20, పార్వతీపురం మన్యం జిల్లాలో ఎనిమిది, అల్లూరి జిల్లాలో ఎనిమిది, అనకాపల్లి జిల్లాలో 11, కాకినాడలో 6, కోనసీమలో నాలుగు, ఏలూరులో నాలుగు, ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు, గుంటూరు జిల్లాలో ఏడు, పల్నాడు జిల్లాలో రెండు, తూర్పు గోదావరి జిల్లాలో మొత్తంగా 15 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 


వడగాడ్పులతో ప్రజలు ఆందోళన


రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలతోపాటు వీస్తున్న వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటలు నుంచే ఎండలు చుర్రుమంటుండడంతో ప్రజలు బయటకు రాలేన పరిస్థితి నెలకొంది. మార్చి నుంచి ఇప్పటి వరకు 90 మంది రాష్ట్రంలో వడదెబ్బ బారినపడ్డారు. ఈ క్రమంలోనే రైతులు, భవన నిర్మాణ, ఇతర రంగాల్లో పని చేసే కార్మికులలు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తరువాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకు ఇంటి ననుంచి బయటకు వెళ్లవద్దని సూచించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో 72 ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పీహెచ్‌సీ వైద్యులు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ విలేజ్‌ క్లినిక్‌ల్లో పని చేసే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో), ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు క్షేత్రస్థాయిలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహనను కలిగిస్తున్నారు. 


ఈ జాగ్రత్తలు తప్పనిసరి


ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఎండ తీవ్రత నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గంట, గంటకు ఉప్పు, చక్కెర కలిపి ద్రవాలు కలిపి తీసుకోవాలని కోరుతున్నారు. కూల్‌ డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని అయినా తాగాలి. ఎండలో పని చేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్ర్తాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలి. బాటిల్‌లో తాగు నీటిని తీసుకుని వెళ్లడం మంచిది. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వతస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. 


నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం


దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొమరిన్‌ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్లు ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం అంతర్గత ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు చత్తీష్‌ఘడ్‌, విదర్భ, మరఠ్వాడా, అంతర్గత కర్ణాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో ఈ నెల 10, 11 తేదీల్లో, రాయలసీమలోనూ అక్కడ్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాలయలసీమల్లో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలోని నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాడ్పులు నుంచి ఉపశమనం కలుగుతుంది. 


వడదెబ్బ తగిలితే ఇలా చేయాలి


ఎండ దెబ్బ తగిలిన వారిని తక్షణమే చల్లని ప్రదేశానికి చేర్చాలి. వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. దుస్తులు వదులు చేసి చల్లని నీటితో శరీరాన్ని తడపాలి. ఇలా చేయడం ద్వారా రక్తనాళాలు కుచించుకుపోకుండా ఆపే అవకాశం ఉంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్‌ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలి.