Visakha Crime News: విశాఖపట్నం జిల్లాలో కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును ఎంవీపీ పోలీసులు ఛేదించారు. కానిస్టేబుల్ హత్య కేసులో ఆయన భార్య శివానియే నిందితురాలిగా తేల్చారు. ప్రియుడి మోజులో పడి కావాలనే భర్తను హత్యచేయించినట్లు విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. అయితే మూడు రోజులు క్రితం కానిస్టేబుల్ రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడని భార్య ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు. ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోస్ట్ మార్టంకు పంపించామని.. అయితే ఆ రిపోర్టులో రమేష్ ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలిందని చెప్పారు. దీంతో కేసును లోతుగా విచారించగా భార్య శివానియే ప్రియుడి కోసం భర్తను చంపించినట్లు పోలీసులు గుర్తించారు.


అసలేం జరిగిందంటే? 


విశాఖకు చెందిన కానిస్టేబుల్ రమేష్ కు, శివానికి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి శివాని.. రామారావు అనే మరో వ్యక్తిని ప్రేమిస్తోంది. అతడితో వివాహేతర సంబంధం కూడా కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న రమేష్.. చాలా సార్లు భార్యతో గొడవ పడ్డాడు. నీకు అంతగా అతడు నచ్చితే పిల్లలను తన వద్దే వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని చెప్పాడు. కానీ శివానీ మాత్రం ప్రియుడితో పాటు పిల్లలు కూడా కావాలని మొండికేసింది. అందుకు రమేష్ అస్సలే ఒప్పుకోలేదు. దీంతో శివాని రమేష్ పై కోపం పెంచుకుంది. ఎలాగైనా సరే అతడి అడ్డు తొలగించుకొని ప్రియుడితో హాయిగా జీవించాలనుకుంది. ఈక్రమంలోనే అతడిని చంపేందుకు ప్రియుడు రామారావుతో  ప్లాన్ వేసింది. 


నగలు తాకట్టుపెట్టి, భర్త హత్యకు సుపారీ! 
ప్రియుడి స్నేహితుడు నీలా అనే వ్యక్తికి భర్తను చంపే పని అప్పజెప్పింది. అందుకోసం తన వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి మరీ లక్ష రూపాయలు ఇచ్చింది. ప్లాన్ ప్రకారమే మూడు రోజుల క్రితం భర్త రమేష్ కు ఫుల్లుగా మద్యం తాగించింది. ఆపై వీడియో తీసింది. అతడు నిద్రలోకి జారుకోగానే ప్రియుడికి, సుపారీ ఇచ్చిన నీలాకు ఫోన్ చేసింది. వెంటనే వారిద్దరూ ఇంటికి వచ్చారు. రామారావు బయటే ఉండి ఎవరూ రాకుండా చూడంగా.. నీలా మాత్రం శివాని సాయంతో ఇంట్లోకి చేరాడు. భార్య శివాని రమేష్ కాళ్లు పట్టుకోగా.. నీలా రమేష్ మొహంపై దిండు పెట్టి నొక్కి చంపాడు. ఆ తర్వాత నీలా, బయటే ఉన్న రామారావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. భార్య శివానీ మాత్రం ఆమెకు ఏమీ తెలియనట్లు భర్త చనిపోయినట్లు అందరికీ తెలిపింది. ఏమైందో తెలియదని వివరించింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే భార్య ప్రవర్తనలో తేడా.. పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరాడక చనిపోయినట్లు రావడంతో పోలీసులు ఈ కేసు ఛేదించారు.


రమేష్ భార్య శివానిని గట్టిగా విచారించగా.. అసలు విషయం బయట పెట్టింది. ప్రియుడి కోసం తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకొంది. ఎప్పుడు, ఎలా హత్య చేశారనేది విచారణలో వెల్లడించింది. అయితే కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో A1 గా భార్య శివాని, A2 గా ప్రియుడు రామారావు, A3 గా నీలా అరెస్ట్ చేశారు. శివానికి ఆమె తల్లిదండ్రులతో కూడా గొడవలు ఉన్నాయని విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ చెబుతున్నారు. ఆమెకు ముందు నుంచే నేర స్వభావం ఉన్నట్లు గుర్తించారు.