Vinesh Phogat: భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఒలింపిక్స్‌లో 50 కిలోల వెయిట్ కేటగిరీలో పోటీకి డిస్ క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై  ప్రతిపక్షాల ఆందోళన, కుట్ర దాగుందనే అనుమానాల మధ్య కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ బుధవారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.  వినేష్‌కు జరిగిన విషయాన్ని కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవియాలో ప్రస్తావించారు. వినేష్ ఫొగట్ 50 కిలోల కేటగిరిలో పోటీలో ఉండగా.. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నట్లు మాండవీయ తెలిపారు. ఈ విషయమై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్‌ పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.


ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉషతో మాట్లాడి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు సెమీ ఫైనల్‌లో గెలిచి నాలుగో పతకం దాదాపు ఖాయం అనుకున్న సమయంలో  వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారత్‌కు షాక్ తగిలింది. 100కోట్ల మంది ఆశలు ఆవిరి అయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌కు ముందు తన బరువు కొలవగా.. 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు పేర్కొన్నారు. 


తొలి భారతీయ మహిళ
 50 కేజీల రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేష్ నిలిచినట్లు కేంద్ర కేంద్ర మంత్రి మాండవీయ లోక్‌సభలో తెలిపారు. ఆమె సెమీ-ఫైనల్లో క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్‌పై, క్వార్టర్ ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పై,  ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్‌లో ప్రపంచ ఛాంపియన్ జపాన్‌కు చెందిన యుయి సుసాకిపై 3-2 తేడాతో విజయం సాధించింది. ఆగస్టు 7వ తేదీ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమె అమెరికన్ రెజ్లర్ సారా ఆన్ హిల్డర్‌బ్రాండ్‌తో పోటీ పడాల్సి ఉంది. 


భారత ప్రభుత్వ సాయం
 భారత ప్రభుత్వం వినేష్ ఫోగట్‌కి పోటీలకు సన్నద్ధం కావడానికి అన్ని రకాల సాయం అందించింది. ఫోగాట్‌కి అసవసరమైన అన్ని రకాల శిక్షణలకు ప్రభుత్వం సాయం అందించినట్లు మంత్రి తెలిపారు.  వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని ప్రకటనలో తెలియజేవారు.  ఆ రంగంలో నిష్ణాతులైన వారిని వ్యక్తిగత సిబ్బందిని కూడా నియమించారు. ప్రఖ్యాత హంగేరియన్ కోచ్ వోలర్ అకోస్, ఫిజియో అశ్విని పాటిల్ ఎప్పుడూ ఆమెతో ఉంటారని చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్‌కు ఆర్థిక సాయం కూడా అందించామన్నారు. కింద పేర్కొన్న వ్యక్తులు వినేష్ ఫొగట్ కి వ్యక్తిగత సిబ్బందిగా ఉన్నారు.



1. వోలార్ అకోస్, కోచ్
2. వేన్ పాట్రిక్ లాంబార్డ్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ స్పెషలిస్ట్ 
3. అశ్విని జీవన్ పాటిల్, ఫిజియోథెరపిస్ట్
4. మయాంక్ సింగ్ గారియా, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్‌పర్ట్
5. శుభమ్, అరవింద్, స్పారింగ్ పార్టనర్స్


పారిస్ ఒలింపిక్స్‌కు మొత్తం రూ.70.45 లక్షలు ఇచ్చినట్లు క్రీడా మంత్రి తెలిపారు. వీటిలో టాప్స్ కింద రూ.53.35 లక్షలు, ఏసీటీసీ కింద రూ.17.10 లక్షలు ఇచ్చారు. గతంలో టోక్యో ఒలింపిక్స్ కోసం రూ.1.66 కోట్లు ఇచ్చారు. బల్గేరియాలో 23 రోజుల శిక్షణకు రూ.5.44 లక్షలు, బుడాపెస్ట్‌లో 16 రోజుల శిక్షణకు రూ.10.54 లక్షలు ఇచ్చారు.


బరువు కారణంగా చెదిరిన కల
వినేష్ 50 కిలోలకు పైగా బరువు ఉండటంతో ఈ పోటీకి అనర్హురాలిగా ప్రకటించడం గమనార్హం. ఈసారి వినేష్ పతకం దాదాపు ఖాయమైంది. కానీ అదనపు బరువు కారణంగా వినేష్ సహా 140 కోట్ల మంది దేశప్రజల కలలు చెదిరిపోయాయి. ఈ సంఘటన తర్వాత, వినేష్ మామ మహావీర్ ఫోగట్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఇందులో ఏమీ చేయలేమని, ఎటువంటి పతకం రాబోదని అన్నారు. వినేష్ పోటీ నుండి తప్పుకున్న తర్వాత, ఆమెను నిజమైన ఛాంపియన్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఛాంపియన్ అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ విషయంలో వినేష్ తప్పేమీ లేదని భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. దీనికి శిక్షకులు, పోషకాహార నిపుణులు బాధ్యత వహించాలన్నారు.