గన్‌ కల్చర్‌పై నినదించిన అమెరికా పౌరులు



అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో నష్టం చేస్తోందో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే వరుసగా మూడు కాల్పులు ఘటనలు జరిగాయి. పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓ స్కూల్‌పై దుండగుడు జరిపిన కాల్పులతో దాదాపు 19మంది ప్రాణాలొదిలారు. వీరిలో విద్యార్థులూ ఉన్నారు. అది మరవక ముందే మరో చోట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గన్ కల్చర్‌ని కట్టడి చేస్తే తప్ప ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉంటాయని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో నినదిస్తున్నారు. ఈ సారి మరో అడుగు ముందుకు వేసి రోడ్లపైకి వచ్చారు. మాకొద్దీ తుపాకీ సంస్కృతి అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపై మార్చ్‌ నిర్వహించారు. చిన్నారులను కాల్చి చంపుతుండటాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ నిరసన గళమెత్తారు. అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్న ఈ గన్‌ కల్చర్‌కి ఎండ్ కార్డ్ వేయాలంటూ చట్టసభ సభ్యులను డిమాండ్ చేశారు. Enough is Enough అంటూ నినదిస్తున్నారు. 



గన్ కంట్రోల్ బిల్‌కు మద్దతు లభిస్తుందా..? 



వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ వద్దకు అందరూ భారీ సంఖ్యలో తరలివచ్చారు. మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరిట ఈ  ర్యాలీ చేపట్టారు. ఓ వైపు జోరు వాన కురుస్తున్నా ఏ మాత్రం లెక్క చేయలేదు. ఆ వర్షంలో తడుస్తూనే గన్ కల్చర్‌ని అంతమొందించాలంటూ మిన్నంటేలా నినాదాలు చేశారు. సుమారు 50వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారని అంచనా. మృతి చెందిన చిన్నారులకు ఎలాగో మళ్లీ ప్రాణం పోయలేం, కనీసం గన్ కల్చర్‌ని నిర్మూలించే చట్టానికి మద్దతు తెలపండి అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. 21 ఏళ్ల లోపు వారికి గన్స్ అమ్మకూడదనే ఉద్దేశంతో బైడెన్ సర్కార్  గన్ కంట్రోల్ బిల్‌ చట్టంగా మారాలంటే సెనేట్‌లో రిపబ్లికన్లు తప్పకుండా సపోర్ట్ చేయాల్సిందే. 


జనాభా కంటే తుపాకులే ఎక్కువ..
అమెరికా జనాభా 33 కోట్లు. కానీ అక్కడ ఉన్న తుపాకుల సంఖ్య మాత్రం 39 కోట్లు. అంటే ఏ స్థాయిలో ఇక్కడ తుపాకులు వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గన్ కల్చర్ వల్ల చెలరేగుతున్న హింసతో అగ్రరాజ్యానికి ఏటా దాదాపు 22 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా. ఇలాంటి ఘటనల్లో నష్టపోతున్న కుటుంబాలు మెడికల్ బిల్స్ కోసం ఏటా 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం తుపాకుల వినియోగించటాన్నీ హక్కుగానే భావిస్తారు. అయితే అక్కడి సుప్రీం కోర్టు మాత్రం "స్వీయరక్షణ కోసం తుపాకులు ఇళ్లలోనే ఉంచుకోవాలి" అని అప్పట్లో వ్యాఖ్యానించింది. కానీ అక్కడి ప్రజలు బాహాటంగా వాటిని బయటకు తీసుకొస్తున్నారు.