Top Headlines Today:


 


నేడు రైతులు భరోసా నిధులు


రైతు భరోసా కింద తొలి విడత నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. దీంతోపాటు మూడు నెలల్లో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులు కూడా విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ 2023-24కు సంబంధించిన రైతు భరోసా నిధులు 3,923,22 కోట్లు, ఇన్‌పుట్ సబ్సిడీ కింద 53.62 కోట్లు  విడుదల చేయనున్నారు. 


 


నేడు సీఎంతో బాలినేని భేటీ


వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ మరోసారి తాడేపల్లికి ఆహ్వానించారు. ఇవాళ(గురువారం) భేటీకి రావాలని పిలుపునిచ్చారు.  మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లికి రావాల్సిందిగా బాలినేనికి సీఎం కార్యాలయం సమాచారం పంపింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం జిల్లా విషయంలో పూర్తి స్థాయి బాధ్యతలివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన వర్గం భావిస్తోంది. గతంలో  బాలినేని అసంతృప్తికి గురయినా పట్టించుకోలేదు. ఇప్పుడు సర్వే రిపోర్టులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని  ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేనికే బాధ్యతలివ్వాలని జగన్ అనుకుంటన్నట్లుగా చెబుతున్నారు. 


 


తెలంగాణ యూనివర్శిటీకి సెలవులు


తెలంగాణ యూనివర్శిటీలో వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. దీంతో మెయిన్‌ క్యాంపస్‌తోపాటు సారంగాపూర్‌ ఎడ్యుకేషన్, భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌లకు సెలవులు ప్రకటించారు. 9వ తేదీ తర్వాత యూనివర్శిటీ పునఃప్రారంభం అవుతుందని వీసీ రవీందర్ ప్రకటించారు. విద్యార్థులు ఇవాళ(గురువారం) మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత క్యాంపస్ విడిచి పెట్టి వెళ్లిపోవాలని ఆదేశించారు. 


 


స్టాలిన్‌తో నేడు కేజ్రీవాల్ భేటీ


ఢిల్లీ ప్రభుత్వాల అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ పార్టీలను మద్దతు కూడగడుతున్న  సీఎం కేజ్రీవాల్‌ నేడు చెన్నై వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తారు. 


 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:                      


సౌత్ ఇండియన్ బ్యాంక్: MD & CEO పోస్టుల కోసం కొత్త పేర్లను సౌత్ ఇండియన్ బ్యాంక్ ఖరారు చేసింది. ఆ అభ్యర్థులకు అనుమతి కోరుతూ ఆర్‌బీఐకి దరఖాస్తు చేయనుంది.


కోల్ ఇండియా: ఇవాళ (జూన్ 1, 2023), ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా కోల్ ఇండియాలో 3% వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.


సెయిల్‌: కంపెనీ చైర్మన్‌గా అమరేందు ప్రకాష్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.


లారస్ ల్యాబ్స్: సెల్, జీన్ థెరపీ కంపెనీ ఇమ్యునోయాక్ట్‌లో (ImmunoACT) తన పెట్టుబడిని లారస్ ల్యాబ్స్ పెంచింది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత, ఇమ్యునోయాక్ట్‌లో లారస్‌ ల్యాబ్స్‌ వాటా 33.86% కు చేరుతుంది.


వేదాంత: ముంబై కేంద్రంగా పని చేస్తున్న మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ (Vedanta Resources), 400 మిలియన్‌ డాలర్ల రుణాలను చెల్లించి, తన మొత్తం అప్పులను 6.4 బిలియన్‌ డాలర్లకు తగ్గించినట్లు తెలిపింది.


గతి: కంపెనీ CEO పిరోజ్‌షా ఆస్పి ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసి, కుర్చీ దిగిపోయారు.


లుపిన్: ఒబెటికోలిక్ యాసిడ్ టాబ్లెట్‌ల కోసం లుపిన్ పెట్టుకున్న కొత్త డ్రగ్ అప్లికేషన్‌కు USFDA నుంచి ఆమోదం లభించింది.


టాటా స్టీల్: టాటా స్టీల్ అనుబంధ సంస్థ టాటా స్టీల్ మైనింగ్ (Tata Steel Mining), ఒక ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఫ్రెంచ్ కంపెనీ మెట్రోన్‌తో (Metron) ఒప్పందంపై సంతకం చేసింది.


HDFC లైఫ్: ప్రమోటర్ కంపెనీ Abrdn, బుధవారం నాడు బల్క్ డీల్స్ ద్వారా HDFC లైఫ్‌లో తన మొత్తం వాటాను ఆఫ్‌లోడ్ చేసింది.


అదానీ గ్రీన్ ఎనర్జీ: రాబోయే రెండు వారాల్లో 1 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించే ప్రతిపాదనను అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించే అవకాశం ఉంది.