Top Headlines Today: 


యువగళం @ 100 డేస్


తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోనుంది. జనవరి 27న మొదలైన పాదయాత్రకు భారీ స్పందన వస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకుంటున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సంఘీభావ యాత్రలు చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, అధికారులు అనేక అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నా వాటిని దీటుగా ఎదుర్కొని పాదయాత్ర లోకేష్‌ చేస్తున్నారని టీడీపీ పార్టీ చెబుతోంది. ఈ యాత్రలో అనేక సామాజిక వర్గాలను, ప్రజలను, రైతులను, విద్యార్థులను, యువతను, మహిళలను కలిసి సమస్యలు తెలుకుంటున్నారని వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారని వివరిస్తున్నారు. 


నేటి నుంచి ఏపీఈఏపీసెట్‌ 2023 పరీక్షలు 


ఏపీ ఈఏపీసెట్‌ 2023 నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం తొమ్మిది సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. తర్వాత 22,23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం 3,37,733 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణలో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. 136 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు ఓ సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తే... మధ్యాహ్నం 3 నుంచి ఆరు గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష నిర్వహించున్నారు. ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి పరీక్ష రాసేందుకు అభ్యర్థులను అనుమతించరు. 


ఐపీఎల్‌లో నేడు 


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 62వ మ్యాచ్ ఈ రోజు (మే 15) గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హార్దిక్ పాండ్యా సేనకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు గెలిస్తే ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టు కానుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ నామమాత్రమే . ఎందుకంటే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం అంత ఈజీ కాదు. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


డీమార్ట్‌: డీమార్ట్‌ రిటైల్ స్టోర్లను నడుపుతున్న రాధాకిషన్ దమానీ యాజమాన్యంలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్చి త్రైమాసిక లాభం 8% YoY వృద్ధితో రూ. 505 కోట్లకు చేరుకోగా, ఆదాయం 21% జంప్ చేసి రూ. 10,337 కోట్లకు చేరుకుంది.




అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) మార్గం ద్వారా మొత్తం రూ. 21,000 కోట్ల నిధులను సమీకరించనున్నట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ ప్రకటించాయి.



అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్: అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, నేటి నుంచి ASM ఫ్రేమ్‌వర్క్ నుంచి బయటకు వచ్చాయి.


నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ రూ. 136 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, అదే సమయంలో కార్యకలాపాల ద్వారా రూ. 697 కోట్ల ఆదాయం వచ్చింది.


అమీ ఆర్గానిక్స్: జనవరి-మార్చి కాలానికి రూ. 27 కోట్ల లాభాన్ని అమీ ఆర్గానిక్స్ ఆర్జించింది, గత ఏడాది కాలంలో ఇది రూ. 21 కోట్లుగా ఉంది. సమీక్ష కాల త్రైమాసికంలోరూ. 186 కోట్ల ఆదాయం వచ్చింది.


HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (HPCL), జనవరి-మార్చి కాలానికి ఏకీకృత నికర లాభంలో 79% వృద్ధితో రూ. 3,608 కోట్లను మిగుల్చుకుంది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 9% పెరిగి రూ. 1.14 లక్షల కోట్లకు చేరుకుంది.


టాటా మోటార్స్: 2023 మార్చి త్రైమాసికంలో రూ. 5,407 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 1,032 కోట్ల నష్టంతో ఉంది. ఈ వాహన తయారీ సంస్థ ఏకీకృత ఆదాయం సంవత్సరానికి 35% (YoY) జంప్‌ చేసి  1,05,932 కోట్ల రూపాయలకు చేరుకుంది.


DLF: రియాల్టీ మేజర్ DLF ఏకీకృత నికర లాభం మార్చి త్రైమాసికంలో 41% పెరిగి రూ. 570 కోట్లకు చేరుకుంది. అయితే, రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 6% తగ్గి రూ. 1,456 కోట్లకు చేరుకుంది.


సిప్లా: ఫార్మా దిగ్గజం సిప్లా, మార్చితో ముగిసిన త్రైమాసికంలో 45% వృద్ధితో రూ. 526 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 5,739 కోట్ల ఆదాయం వచ్చింది, ఏడాది ప్రాతిపదికన 9% పెరిగింది.


వేదాంత: మార్చి త్రైమాసికంలో, మైనింగ్ దిగ్గజం వేదాంత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 67.5% క్షీణించి రూ.1,881 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా ఆర్జించిన ఆదాయం 5.4% తగ్గి రూ. 37,225 కోట్లకు చేరుకుంది.


సొనాటా సాఫ్ట్‌వేర్: మార్చి త్రైమాసికంలో సొనాటా సాఫ్ట్‌వేర్ నికర లాభం 3% తగ్గి రూ. 114 కోట్లకు చేరుకోగా, కార్యకలాపాల ఆదాయం 15% పెరిగి రూ. 1,913 కోట్లకు చేరుకుంది.