Kerala Story Controversy: 



పశ్చిమ బెంగాల్‌లో బ్యాన్ 


The Kerala Story సినిమాపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమూ ఆగడం లేదు. కొన్ని బీజేపీ రాష్ట్రాల్లో దీనిపై ట్యాక్స్ ఎత్తివేయగా...బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం ఈ సినిమా ప్రదర్శనపై ఆంక్షలు విధిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ఏకంగా ఈ సినిమాపై బ్యాన్ విధించింది. తమిళనాడులోనూ కొన్ని థియేటర్ యాజమాన్యాలు ఈ సినిమాని ప్రదర్శించడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సినిమాని నిషేధించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నోటీసులు కూడా ఇచ్చింది. ఈ విషయం ప్రస్తావిస్తూ మాల్వియా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. థియేటర్లు సినిమాను ప్రదర్శించాలని చూస్తున్నా..కొందరు లోకల్ లీడర్స్‌ వాళ్లను బెదిరిస్తున్నారని తేల్చి చెప్పారు. ఆ సినిమాపై కావాలనే కక్ష కడుతున్నారని మండి పడ్డారు. "సినిమా ప్రదర్శిస్తే శిక్ష తప్పదు" అని కొందరు నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. 


"పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ది కేరళ స్టోరీపై బ్యాన్ విధించింది. దీనిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ బ్యాన్‌ ఎత్తివేసింది. అయినా కోల్‌కత్తాలో ఒక్క థియేటర్‌లో కూడా సినిమాని ప్రదర్శించడం లేదు. ప్రభుత్వం బ్యాన్ చేయకముంది అన్ని హాల్‌లూ నిండిపోయాయి. ఇప్పుడు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. సినిమాని ప్రదర్శిస్తే శిక్ష తప్పదని అధికారులు థియేటర్ యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు. లైసెన్స్‌లు తీసేస్తామని బెదిరిస్తున్నారు. ఇది కోర్టు ఉల్లంఘన కాదా..? సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలి. సుప్రీంకోర్టు ఆదేశాలనే పట్టించుకోడం లేదంటే అక్కడ ఎలాంటి పాలన కొనసాగుతుందో అర్థమవుతోంది"


- అమిత్ మాల్వియా, బీజేపీ ఐటీ డిపార్ట్‌మెంట్ చీఫ్