Revanth Reddy Vijayawada Tour: తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తీరిక లేకుండా గడుపుతున్నారు. వివిధ శాఖలపై రివ్యూలు నిర్వహిస్తూ కీలక మార్పులు సూచిస్తున్నారు. తాజాగారేవంత్‌ రెడ్డి వచ్చే వారం విజయవాడకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తిరుమల శ్రీవారిని రేవంత్ దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం హోదాలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో కూడా సీఎం రేవంత్ సమావేశం అవుతారని తెలుస్తోంది. విభజన చట్టంలోని కీలక అంశాలపై వారు చర్చించనున్నట్లు తెలిసింది. అయితే సీఎం ఏపీ పర్యటనపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే జూన్ నెలతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే గడువు ముగియనుంది. అదే విధంగా నీటి వివాదాలు, పెండింగ్ లో ఉన్న విభజన అంశాలు ఉన్నాయి. ఒకవేళ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరిగితే ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తాము ఏపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నట్లుగా ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఏపీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.