AP Drugs Smuggling Cases: డ్రగ్స్ స్వాధీనం అత్యధిక స్థాయిలో ఏపీలోనే చిక్కుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోమవారం విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక పేర్కొంది. దీని ప్రకారం సీఆర్పీఎఫ్ 2021-22లో ఏపీలో 18 వేల 267.84 కిలోల డ్రగ్స్/నార్కోటిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో భాంగగా మొత్తం 90 మందిని అరెస్ట్ చేశారు. దేశంలో ఇంత ఎక్కువగా మత్తు పదార్థాలను ఆంధ్రప్రదేశ్‌లోనే స్వాధీనం చేసుకున్నారు. ఏపీ తర్వాతి స్థానాల్లో 10 వేల 104 కిలోలతో త్రిపుర, 3 వేల 366 కిలోలతో అసోం, వెయ్యి 12 కిలోలతో తెలంగాణ, 830 కిలోలు ఛత్తీస్ గఢ్  ఉన్నాయి. అక్రమంగా తుపాకులను తెలంగాణలో నాలుగు స్వాధీనం చేసుకుంటే ఏపీలోని సీఆర్పీఎఫ్ 4 అక్రమ తుపాకులను స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు అరెస్టు అయితే... తెలంగాణ ఒక్కరినే అరెస్టు చేసింది. 


ఏపీలో 1,057 కిలోల గంజాయి స్వాధీనం..


ఏపీలో 2021-22 సంవత్సరంలో వెయ్యి 57 కిలలో గంజాయిని డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. మధ్య ప్రదేశ్ లో 5 వేల 846 కిలోలు, త్రిపురలో 4 వేల 264 కిలోలు, ఉత్తర్ ప్రదేశ్ లో 3 వేల 141 కిలోలు, అసోంలో 2 వేల 800 కిలోలు, మహారాష్ట్ర 2 వేల 639 కిలోలు, మేఘాలయలో వెయ్యి 356 కిలోలు, బిహార్ లో వెయ్యి 297 కిలోలు తర్వాత ఎక్కువగా పట్టుబడింది ఏపీలోనే. 2021-22 సంవత్సరంలో దేశం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.97 కోట్ల విలువైన 161.83 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ నివేదిక తెలిపింది.


పెద్ద మొత్తంలో భారత్ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్.. 


కడప, చిత్తూరు జిల్లాలోని పాలకొండ, శేషాచలం పర్వత శ్రేణుల్లో ఎర్ర చందనం ఎక్కువగా దొరుకుతుంది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా ఇది ఎర్రచందనం పెరుగుతుంది. దేశీయంగా దీని వినియోగం చాలా తక్కువ. ఆయుర్వేద మందులు, చిన్న చిన్న బొమ్మల తయారీకి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. నిర్మాణ, ఫర్నిచర్, తయారీకి దేశీయంగా దీని డిమాండ్ చాలా తక్కువ. దీంతో ఇది చైనా, జపాన్ కు అక్రమంగా తరలిపోతున్నట్లు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న సరుకును బట్టి తెలుస్తోంది. ఈ మొక్కలు పండే చోటుతో పోలిస్తే.. తరలించే చోట ఉన్న ధరల వ్యత్యాసం స్మగ్లర్లకు అత్యంత అనువుగా మారింది. అందుకే పెద్ద మొత్తంలో భారత్ నుంచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 


విమానాల ద్వారానూ స్మగ్లింగ్..


ముఖ్యంగా ముంబయిలోని నావసేన, గుజరాత్ లోని ముంద్రా, తమిళనాడులోని చెన్నై పోర్టుల నుంచి ఎక్కువగా తరలిపోతుంది. కొన్నిసార్లు సెజ్ ల నుంచి వెళ్తోంది. ఎర్ర చందనంతో నింపిన కంటెయినర్లను తొలుత దుబాయ్, మలేసియా, దక్షిణ కొరియాలకు తరలించి అక్కడి నుంచి అంతిమ గమ్యస్థానాలకు పంపుతున్నారు. తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఈ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల చిన్న పరిమాణంలో విమానాల ద్వారానూ స్మగ్లింగ్ చేస్తున్నట్లు బయట పడింది. ఇనుము, బ్రాస్ హార్డ్ వేర్, ప్రెషర్ కుక్కర్లు, గృహవినియోగ వస్తువులు, రెడీమేడ్ దుస్తులు, గ్రానైట్ స్లాబులు, ట్రాక్టర్ విడి భాగాలు, ఐరన్ పైప్ ల పేరుతో వీటిని ఎక్కువగా తరలిస్తున్నారని డీఆర్ఐ నివేదికలో పేర్కొంది.