IPL 2025 SRH 3rd Victory: సన్ రైజర్స్ సాధించింది. తన కెరీర్ లో తొలిసారి చేపాక్ కోటను బద్దలు కొట్టింది. 12 ఏళ్ల నుంచి ఆడుతున్నా ఇప్పటికీ ఐదు సార్లు అక్కడ ఓడిపోయింది. అయితే తొలిసారి శుక్రవారం అక్కడ జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ  గెలిచింది. దీంతో సీజన్ లో 3వ విక్టరీ సాధించి, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 19.5 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బేబే ఏబీగా పేరుగాంచిన డెవాల్డ్ బ్రివిస్ (25 బంతుల్లో 42, 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ కు నాలుగు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌లో సన్ రైజర్స్ 18.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ గా నిలిచి, జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు. నూర్ అహ్మద్ కు రెండు వికెట్లు దక్కాయి. ఇక కెరీర్ లో 400 వ టీ20 మ్యాచ్ ఆడిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆరు పరుగులే చేశాడు. మొత్తం మీద తన జట్టుకు పరాజయం ఎదురైంది. 

క‌ట్ట‌డి చేసిన బౌల‌ర్లు..ప‌క్కా ప్ర‌ణాళిక‌తో బ‌రిలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్.. చేపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిలువ‌రించింది. ఆరంభం నుంచే బ్యాట‌ర్లను కట్ట‌డి చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే తెలుగు కుర్రాడు షేక్ ర‌షీద్ ను మ‌హ్మ‌ద్ ష‌మీ డ‌కౌట్ చేశాడు. ఆ త‌ర‌వాత వ‌న్ డౌన్ లో వ‌చ్చిన శామ్ కర్రాన్ (9) మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. మరో ఎండ్ లో టీనేజ‌ర్ ఆయుష్ మాత్రే (19 బంతుల్లో 30, 6 ఫోర్లు) కాస్త విధ్వంస‌క‌రంగా ఆడాడు. అత‌నికి ర‌వీంద్ర జ‌డేజా (21) కూడా చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. వీరిద్ద‌రూ ప‌ర్యాట‌క బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. అయితే మంచి స్టార్ట్ వ‌చ్చినా మాత్రే దాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక ఔట‌య్యాడు. ఈ ద‌శలో జ‌డేజాతో క‌లిసి స్కోరు బోర్డును బ్రెవిస్ ప‌రుగులెత్తించాడు. సూప‌ర్ ట‌చ్ లో క‌నిపించిన ఈ సౌతాఫ్రికన్.. ఆరు బౌండ‌రీల‌తో స‌త్తా చాటాడు. అయితే మ‌ధ్య‌లో జ‌డ్డూ ఔటైనా త‌న జోరు మాత్రం త‌గ్గించ‌లేదు. ఫిఫ్టీ వైపు వెళుతున్న బ్రెవిస్ ను అద్బుత క్యాచ్ తో క‌మిందు మెండిస్ పెవిలియ‌న్ కు పంపాడు. చివ‌ర్లో దీప‌క్ హూడా (22) కాస్త వేగంగా ప‌రుగులు సాధించ‌డంతో 150 ప‌రుగుల మార్కును సీఎస్కే దాటింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్, జ‌య‌దేవ్ ఉనాద్క‌ట్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి.

వ‌న్ మేన్ షో.. గ‌త మ్యాచ్ లో ఔట్ కాకున్నా, పెవిలియ‌న్ కు వెళ్లి తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన ఇషాన్ కిష‌న్ ఈ మ్యాచ్ లో చాలా బాధ్య‌తాయుతంగా ఆడాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ ఔట‌వ‌డంతో క్రీజులోకి వ‌చ్చిన ఇషాన్.. చాలా బాగా ఆడాడు. ఫ‌స్ట్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (19) తో క‌లిసి రెండో వికెట్ కు 37 ప‌రుగులు జోడించాడు. వీరిద్ద‌రూ పోటాపోటీగా ఆడి బౌండ‌రీలు సాధించారు. హెడ్ ఔటైన త‌ర్వాత ప్ర‌మోష‌న్ పొంది నెంబ‌ర్ ఫోర్ లో వ‌చ్చిన క్లాసెన్ (7) విఫ‌ల‌మ‌య్యాడు. మ‌రో ఎండ్ లో మాత్రం కిష‌న్ వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. అత‌నికి అనికేత్ వ‌ర్మ (19) చ‌క్క‌ని స‌హ‌కారం అందించారు. వీరిద్ద‌రూ 36 ప‌రుగులు జోడించి, స‌న్ రైజ‌ర్స్ గెలుపుకు జీవం పోశారు. అయితే ఫిఫ్టీకి చేరువ‌లో అనూహ్యంగా కిషన్ ఔట్ కావ‌డం, అనికేత్ అన‌వ‌స‌ర షాట్ కు ప్ర‌య‌త్నించి పెవిలియ‌న్ కు చేర‌డంతో మ్యాచ్ లో ఉత్కంఠ నెల‌కొంది. ఈ ద‌శ‌లో  కమిందు మెండిస్ (32 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) 49 పరుగల అజేయ కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. తాజా ఫలితంలో టోర్నీ నుంచి దాదాపు సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించినట్లే.