Shraddha Murder Case: సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్‌ హత్య కేసులో పురోగతి వచ్చింది. ఇరువురి బ్యాంకు ఖాతా వివరాలు, కాల్‌ రికార్డుల నుంచి పోలీసులు ఈ బ్రేక్‌ త్రూ సాధించారు. మొదటి నుంచి దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న అఫ్తాబ్ పూనావాలా భౌతిక సాక్ష్యాలను తొలగించినప్పటికీ ఈ కేసులో పోలీసులకు డిజిటల్ సాక్ష్యాలు సాయం చేశాయి. 


అఫ్తాబ్ చెప్పిన వివరాల ప్రకారం, శ్రద్ధా మే 22న (మే 18 న చనిపోయింది) తన ఫోన్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఆమె అందుబాటులో లేదని చెప్పాడు. అయితే కాల్ రికార్డులను ట్రేస్ చేసినప్పుడు శ్రద్ధా చివరిగా వాళ్లు ఉన్న దిల్లీ నివాసంలోనే ఫోన్ మాట్లాడినట్లు తేలింది. 


బ్యాంకింగ్ వివరాలు


మే 26న శ్రద్ధా నెట్ బ్యాంకింగ్ అకౌంట్ యాప్ నుంచి అఫ్తాబ్ ఖాతాకు రూ. 54,000 లావాదేవీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ జంటకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసుల సేకరించారు. మే 22 తర్వాత శ్రద్ధా అందుబాటులో లేదని అఫ్తాబ్ చెప్పిన మాటలు అబద్ధమని ఈ వివరాలతో తేలిపోయింది. అంతేకాదు మే 26న జరిగిన బ్యాంకు బదిలీ లొకేషన్ కూడా మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నట్లు తేలింది.


ఇదీ కేసు


అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.


కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అఫ్తాబ్‌పై అనుమానం


తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.


అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.


దర్యాప్తులో


అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది. 


Also Read: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్