21st August 2024 School News Headlines Today: 

నేటి ప్రత్యేకత


  • ప్రపంచ కవితా దినోత్సవం

  • జాతీయ వృద్ధుల దినోత్సవం 


ఆంధ్రప్రదేశ్‌ వార్తలు : 


  • ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఉచిత ప్రయాణం కోసం అదనంగా బస్సులు కొనాలని... డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని ఆ నివేదికలో పేర్కొన్నారు. 

  • విద్యార్థులు ఓటమి నుంచే విజయానికి బాటలు వేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ఎం.వి.ఆర్‌.కృష్ణతేజ దిశానిర్దేశం చేశారు. జేఎన్‌టీయూకే 17వ ఆవిర్భావం సందర్భంగా ఆయన యంగ్‌ ఎచీవర్‌ పురస్కారాన్ని స్వీకరించారు.  విద్యార్థులు విజయం సాధించేవరకు విశ్రమించవద్దని హితబోధ చేశారు.
      


తెలంగాణ వార్తలు : 


  • తెలంగాణ సచివాలయ ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన రోజైన డిసెంబరు 9న విగ్రహ ప్రతిష్ఠాపనను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 

  • తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉదయమంతా ఉక్కపోత పోస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. యాదాద్రి 16.8 సెంటీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


జాతీయ వార్తలు: 


  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్‌-4, చంద్రయాన్‌-5 వ్యోమనౌకల డిజైన్లు పూర్తయినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది. 

  • తెలుగు వ్యక్తికి మరో కీలక పదవి దక్కింది. భారత సౌర ఇంధన కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా శివకుమార్‌ వి.వేపకొమ్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో శివకుమార్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు.  


అంతర్జాతీయ వార్తలు: 


  • ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డ్ కెక్కిన స్పెయిన్ మహిళ మరియా బ్రన్యాస్‌ 117 ఏళ్ల 168 రోజుల వయసులో మృతి చెందారు. మరియా 1907 మార్చి 4న అమెరికాలో జన్మించారు. ఆమె రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. ఈమె  మరణంతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా జపాన్‌కు చెందిన టొమికా ఇటూకా 116ఏళ్లతో నిలిచారు.

  • మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ అనేది కొత్త కొవిడ్ వైరస్ కాదని WHOస్పష్టం చేసింది. ‘ఎంపాక్స్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ వైరస్‌ను మనం నియంత్రిస్తామా లేదా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది’ అని తెలిపారు.


క్రీడా వార్తలు: 


  • మహిళల టీ20 ప్రపంచకప్‌ వేదిక ఖరారైంది. యూఏఈ వేదికగా ఈ టోర్నీని నిర్వహించాలని ICC నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరగనుంది. వారం రోజుల ముందుగానే సెప్టెంబర్‌ 27నుంచి వార్మప్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి.

  • టీ20లలో ప్రపంచ రికార్డు నమోదైంది. ICC మెన్స్ టీ20 ప్రపంచ కప్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్‌ క్వాలిఫయర్ మ్యాచ్‌లో వనాటు జట్టుపై సమోవా ప్లేయర్ విస్సర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. బౌలర్ 3 నోబాల్స్ వేయడంతో ఆ ఓవర్‌లో 39 పరుగులు వచ్చాయి. టీ20లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.


మంచిమాట

తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ విద్యార్థులకు వెలుగులు పంచేవాడు గురువు