ముంబయి డ్రగ్స్ కేసులో కీలక అప్‌డేట్ వచ్చింది. అధికారి సమీర్ వాంఖడేను డ్రగ్స్ కేసును దర్యాప్తు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్‌సీబీ ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసులో వాంఖడే పెద్ద ఎత్తున లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు కూడా జరుగుతోంది.


మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ కూడా వాంఖడేపై వరుస ఆరోపణలు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో సాక్షిగా పేర్కొంటోన్న ప్రభాకర్ సాలీ కూడా వాంఖడేపై ఆరోపణలు చేశాడు.


సమీర్ వాంఖడే ప్రస్తుతం దిల్లీ ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చి రిపోర్ట్ చేయాలి. అనంతరం ముంబయి జోనల్ డైరెక్టర్‌గా సంజయ్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.


వాంగ్మూలం రికార్డ్..


ఎన్‌సీబీ సీనియర్ అధికారైన సమీర్ వాంఖడే వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు ఇటీవల రికార్డ్ చేశారు. అనంతరం ఎన్‌సీబీ నియమించిన ఐదుగురు దర్యాప్తు కమిటీలో ఒకరైన డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


అయితే అంతకుముందే ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్‌సీబీ ఆఫీసు నుంచి కీలక డాక్యుమెంట్లు, రికార్డింగ్‌లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


" వాంఖడే వాంగ్మూలాన్ని మేం రికార్డు చేసుకున్నాం. ఇది చాలా కీలకమైన దర్యాప్తు, కనుక ఇప్పుడే అన్ని విషయాలను బహిర్గతం చేయలేం. దర్యాప్తును ప్రారంభించాం. సాక్షులను ఒక్కొక్కరిగా పిలిచి వాంగ్మూలాలు రికార్డ్ చేస్తాం.                                               "




-జ్ఞానేశ్వర్ సింగ్, ఎన్‌సీబీ డీడీజీ

 

ఇదీ కేసు..

 

ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో అక్టోబర్ 3న జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సమీర్ వాంఖడే నేతృత్వంలో అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా పలువుర్ని అధికారులు అరెస్ట్ చేశారు.

 



Also Read: Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ కొనసాగింపు.. రాజీనామా ఉపసంహరణ