UN Security Council: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత హోదా- రష్యా మద్దతు!

ABP Desam   |  Murali Krishna  |  25 Sep 2022 03:06 PM (IST)

UN Security Council: ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనకు రష్యా మద్దతు ప్రకటించింది.

UN Security Council: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత హోదా- రష్యా మద్దతు!

(Image Source: PTI)

UN Security Council: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్‌కు రష్యా తన మద్దతును ప్రకటించింది. ఈ హోదా పొందడానికి భారత్‌తో పాటు బ్రెజిల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శనివారం ప్రసంగించిన సమయంలో రష్యా విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయంగా భారత్, బ్రెజిల్ దేశాలు చాలా కీలకమైనవి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కనుక భారత్, బ్రెజిల్‌ దేశాలకు.. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలి. దీనికి రష్యా పూర్తి మద్దతు ప్రకటిస్తోంది.                           - సెర్గీ లావ్రోవ్‌, రష్యా విదేశాంగ మంత్రి
 

భారత్ ముందుంది

మండలిలో తీసుకురావాల్సిన అత్యవసర మార్పులను ప్రతిపాదించడంలో భారత్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటోందని ఆయన అన్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం ద్వారా ఐరాస భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యయుతంగా మార్చాల్సిన అవసరం ఉందని లావ్రోవ్‌ అన్నారు. 

ప్రస్తుతం భద్రతా మండలిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్‌, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. మరో 10 దేశాలు తాత్కాలిక శాశ్వత సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి. వీటిని ప్రతి రెండేళ్లకోసారి ఐరాస సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది. ప్రస్తుతం భారత్‌ తాత్కాలిక శాశ్వత సభ్యదేశంగా కొనసాగుతోంది. డిసెంబరుతో ఆ గడువు ముగియనుంది. 

ఉగ్రవాదంపై

శనివారం ఐరాస సర్వప్రతినిధి సభలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద చర్యల వెనక ఉద్దేశం ఏమైనా దానిని సహించేది లేదని జైశంకర్ అన్నారు.

ఉగ్రచర్యల్ని కొన్ని దేశాలు ఎంతగా సమర్థించుకున్నా అవి రాసిన రక్త చరిత్రను చెరిపేయలేవు. ఐరాస భద్రతామండలి ఆంక్షల్ని రాజకీయం చేసేవారు దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అనేక దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాద బెడదను ఎదుర్కొంటున్న భారత్‌.. ఎంతమాత్రం ఉగ్రవాదాన్ని సహించబోదు. ఐరాస భద్రతామండలిలో సంస్కరణలను ఉద్దేశపూర్వకంగా కొన్నిదేశాలు అడ్డుకుంటున్నాయి.                                        -  జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

Also Read: Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Also Read: Iran Protest: హిజాబ్‌ ఆందోళనలు ఉద్ధృతం- 50 మంది వరకు మృతి!

Published at: 25 Sep 2022 02:51 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.