Missile Attack on Poland:
ఇద్దరు మృతి..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పొరుగు దేశాలు కూడా టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా..పోలాండ్లోనూ ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. చాన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ పౌరులు అంతా పోలాండ్కు వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్ శరణార్థులకు అండగా ఉంటామని పోలాండ్ కూడా గతంలో ప్రకటించింది. ఈ ప్రకటనతో రష్యా తీవ్రంగా మండి పడింది. అప్పటి నుంచి పోలాండ్ను కూడా టార్గెట్ చేసుకుంది. నేరుగా తలపడక పోయినా...అక్కడ అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తోంది. నాటో సభ్య దేశమైన పోలాండ్పై రష్యా మిసైల్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో పోలాండ్ ఆర్మీ అప్రమత్తమైంది. కానీ...రష్యా మాత్రం ఈ దాడి తాము చేయలేదని ఖండిస్తోంది. పోలాండ్ మీడియా కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని మండి పడింది. ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాలిలో G-7,NATO ఆత్యయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ..రష్యాపై ఆరోపణలు చేశారు. యుద్ధ వాతావరణాన్ని మరింత సంక్లిష్టం చేసేందుకే రష్యా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.
ఇది రష్యా పని కాదు: బైడెన్
అయితే..అమెరికా అధ్యక్షుడు బైడెన్...ఇది రష్యా పని కాదని అంటున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని వెల్లడించారు. రష్యా భూభాగం నుంచి ఈ మిసైల్ రాలేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. పోలాండ్ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంతో తెలుసుకోవాలని అన్నారు. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఎప్పటిలాగే ఉద్రిక్తంగా కొనసాగుతోంది. రష్యా ఇటీవలే ఉక్రెయిన్లోని
పలు ప్రాంతాలపై క్షిపణి దాడులు చేసింది. కీవ్, ఖార్కివ్, లీవ్, పొల్టెవాపై రష్యన్ మిజైల్స్ దూసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దు ప్రాంతంలో ఓ మిసైల్ కూలి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పోలాండ్లోని ప్రొజెవెడో (Projevodo) గ్రామంపై ఈ క్షిపణి పడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలాండ్ ప్రభుత్వం...రాత్రికి రాత్రే డిఫెన్స్ కౌన్సిల్ ఆత్యయిక సమావేశం నిర్వహించింది.
రష్యా రక్షణ శాఖ మాత్రం...పోలాండ్ను టార్గెట్గా చేసుకోలేదని, ఈ దాడి చేసింది తాము కాదని చెబుతోంది.
చర్యలు తీసుకోండి: జెలెన్స్కీ
ఈ దాడులతో తమకు సంబంధం లేదని రష్యా చెబుతున్నా..జెలెన్స్కీ మాత్రం రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాటో దేశాలు రష్యాపై కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు. రష్యా ఉగ్రవాదం కేవలం తమ దేశానికే పరిమితం కావడం లేదని, మిగతా దేశాల్లోనూ అలజడి రేపుతోందని ఆరోపించారు. నాటో దేశమైన పోలాండ్పై దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు, జెలెన్స్కీ...పోలాండ్ అధ్యక్షుడు ఆండ్ర్జెజ్ దుడతో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత వైరం ఉంది. ఇలాంటి ఘటనలు.. పరిస్థితులు అదుపు తప్పుతాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.
Also Read: UK Visa: మోదీతో భేటీ తర్వాత- భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి సునక్!