Republic Day 2023: దేశం ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య్ పథ్ మార్గంలో దేశంలోని సైనిక, ఆర్థిక, సాంస్కృతిక శక్తిని కళ్లకు కట్టినట్లు చూపించే శకటాల ప్రదర్శనలు అందరినీ అబ్బురపరిచాయి. అయితే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈజిప్టు అధ్యక్షుడి వెంట ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈజిప్టు సైన్యానికి చెందిన బృందం కూడా పాల్గొంది. బుధవారం (జనవరి 25) ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరుండి రాష్ట్రపతి భవన్‌లో ఈజిప్టు అధ్యక్షుడు స్వాగతం పలికినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి బాగ్చి ట్వీట్టర్ ద్వారా తెలిపారు. గణతంత్ర దినోత్సవం  వేడుకల్లో పాల్గొనేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏయే దేశా అధినేతలను ఆహ్వానించిందో మన ఇప్పుడు తెలుసుకుందాం. 


2020లో ముఖ్య అతిథిగా..!


2020లో రిపబ్లిక్ డే సందర్భంగా బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా బోల్సోనారోను భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. అతను బ్రెజిల్ 38 వ అధ్యక్షుడు, ప్రస్తుతం అతను అమెరికాలో నివసిస్తున్నాడు.


2019లో ముఖ్య అతిథిగా..!


2019 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీ20 సదస్సు సందర్భంగా భారత్‌లో జరిగే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు.


2018లో ముఖ్య అతిథిగా..!


2018లో భారతదేశం ఒక కొత్త ప్రయోగం చేసి, రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఆసియాన్ దేశాల అధినేతలను ముఖ్య అతిధులుగా ఆహ్వానించింది. ఆ సమయంలో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, బ్రూనై, కంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్ మరియు వియత్నాం ఉన్నాయి.


2017లో ముఖ్య అతిథిగా..!


మో. బిన్ జాయెద్ అల్ నహ్యాన్ క్రౌన్ ప్రిన్స్ 26 జనవరి 2017న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యుఎఇ మిలిటరీ సుప్రీం డిప్యూటీ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను భారత ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ద్వారా ప్రభుత్వం దౌత్యపరమైన విజయాన్ని అందించింది.


 2016లో ముఖ్య అతిథిగా..!


ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ 2016 రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వచ్చిన తర్వాత విదేశీ సైనిక బృందాలు ఆయన రాకపై కవాతులో పాల్గొనడం ఇదే తొలిసారి.


2015లో ముఖ్య అతిథిగా..!


జనవరి 26వ తేదీ 2015న భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా పిలిచారు. అధ్యక్షుడు ఒబామాతో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా భారత్‌కు వచ్చారు.