Bhagwant Mann Confidence Motion: పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం- సభ నుంచి BJP వాకౌట్!

ABP Desam   |  Murali Krishna   |  27 Sep 2022 04:30 PM (IST)

Bhagwant Mann Confidence Motion: పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఆమ్‌ఆద్మీ సర్కార్.

(Image Source: PTI)

Bhagwant Mann Confidence Motion: పంజాబ్‌ అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ సర్కార్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భాజపా సభ్యులు వాకౌట్ చేశారు.

తీర్మానం

స్పీకర్‌ కుల్టార్‌సింగ్‌ సంధ్‌వాన్‌ అసెంబ్లీలో భగవంత్ మాన్‌ ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మాన ప్రకటన చేశారు. ప్రకటన చేసిన వెంటనే భాజపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విశ్వాస పరీక్ష, ఇతర పరిణామాల కారణంగా అసెంబ్లీ సమావేశాలను అక్టోబర్‌ 3 వరకు పొడిగించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)లో నిర్ణయించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. 

మాన్ విమర్శలు

ఈ రోజు, భాజపా, కాంగ్రెస్‌ రెండూ ఒక్కటైపోయాయి. ఇది సభలో బహిర్గతమైంది. పంజాబ్‌లో వారి 'ఆపరేషన్ లోటస్' విఫలమైంది. భాజపా, కాంగ్రెస్‌ కూడా సభ నిర్వహించనివ్వ లేదు. మమ్మల్ని మాట్లాడనివ్వలేదు.                  -   పంజాబ్ సీఎం భగవంత్ మాన్

ఇదీ జరిగింది

సెప్టెంబర్‌ 22న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల కోసం ఆప్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే కేవలం విశ్వాస తీర్మానం కోసమని ప్రభుత్వం కోరిడంతో గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ అందుకు అంగీకరించలేదు. సభ నిబంధనలు అందుకు అంగీకరించవని భాజపా, కాంగ్రెస్‌ గవర్నర్‌ను కోరడంతో ఆయన న్యాయ అభిప్రాయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ఆప్ ప్రభుత్వం విమర్శలు చేసింది. 

విశ్వాస తీర్మానంతో పాటు సభలో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ప్రభుత్వం నివేదించడంతో గవర్నర్‌ సెప్టెంబర్‌ 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. 

సీఎంపై ఆరోపణలు

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఇటీవల సంచలన ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జర్మనీ పర్యటనకు వెళ్లారు పంజాబ్ సీఎం. అయితే ఆయన తిరిగి పంజాబ్‌కు వచ్చిన విమానం రాక ఆలస్యం కావడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆయన ఫుల్‌గా తాగడంతో విమానం నుంచి దించేశారంటూ శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్​బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.

మాన్​తోపాటు జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో మాన్ ఉన్నారని ట్వీట్​లో పేర్కొన్నారు.

ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని పౌర విమానయాన శాఖ మంత్రి సింధియాకు లేఖ రాశారు. కాగా, ఈ ఆరోపణలను ఆమ్​ఆద్మీ పార్టీ ఖండించింది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని పేర్కొంది. సీఎంను అగౌరపరిచేందుకు విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడింది.

Also Read: Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Also Read: Shinzo Abe Funeral: షింజో అబేకు మోదీ కన్నీటి వీడ్కోలు- 100 దేశాల ప్రతినిధులు హాజరు!

Published at: 27 Sep 2022 04:16 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.