"ప్రపంచం అంతా నిద్రిస్తున్న వేళ .. అర్థరాత్రి భారత్ కొత్త జీవితం, స్వేచ్చల కోసం  మేలుకుంది..! "  అని 74 ఏళ్ల క్రితం భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన క్షణాన జవహర్‌లాల్ నెహ్రూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ మాటల వెనుక ఎంతో అర్థం ఉంది. స్వాతంత్రం వస్తేనే సమస్యలు పరిష్కారం కావు. అప్పట్నుంచే అసలు సమరం ప్రారంభమవుతుంది. దేశానికి ప్రజలందరూ కలిసి ఓ దశ.. దిశ తీసుకు రావాల్సిన అవసరం అప్పుడు ఉంది. అప్పట్నుంచి ఇప్పటికి 74ఏళ్లు పూర్తయ్యాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇన్నేళ్ల కాలంలో భారత్ ఏం సాధించింది..? ప్రపంచంతో పోటీ పడి ఎంత ముందుకెళ్లాం..? 


వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వపడే విజయాలు.! 


రెండు శతాబ్దాల బానిసత్వం.. త్యాగధనుల పోరు ఫలితం.. స్వేచ్చా గీతికతో మువ్వన్నెల స్వాతంత్ర్య భారతం.  రెండు వందల సంవత్సరాలు భారత్‌ను తమ కబంధ హస్తాల్లో బిగించిన ఆంగ్ల పాలకుల్ని తరిమేయడానికి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి పౌరుడూ ఓ యోధుడయ్యాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో సామాన్యుడు సైతం దేశం కోసం సర్వం త్యాగం చేశాడు. జెండా పట్టుకుని భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు వజ్రాయుధమే అయ్యాడు.  అలా అందరి రక్తం, కష్టం, త్యాగం సమ్మిళితంగా మన చేతికందిన స్వాతంత్య్రానికి 75వ ఏడు వచ్చింది.  ఏమి సాధించామన్న విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవడానికి.. సాధించాల్సిందేమిటని నిర్దేశించుకోవడానికి ఇది అరుదైన అవకాశం. 74 ఏళ్ల కిందటి ప్రజల జీవన ప్రమాణాలతో పోలిస్తే ఇప్పుడు దేశం ఎంతో పురోగమించింది. మన పూర్వికుల వరకూ ఎందుకు... ఈ నాటి యువత తల్లిదండ్రుల్ని అడిగితేనే తాము ఎలాంటి మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో పెరిగామో చెబుతారు. ఓ పాతికేళ్ల ఏళ్ల క్రితం వరకూ సగం జనాభాకు కరెంట్ అంటే తెలియదు. ఇంటర్నెట్ అనే పదం కూడా తెలియదు. ఇక రోడ్లు , మంచినీరు , గ్యాస్ వంటి సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాంటి పరిస్థితుల్ని  ... ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చూసుకుంటే దేశం ఎంతో పురోగమించిందని అర్థం చేసుకోవచ్చు. దేశంలో కరెంట్ అందని గ్రామం లేదని ఇటీవలే కేంద్రం ప్రకటించింది.  చిట్ట చివరి గ్రామానికీ విద్యుత్ వెలుగులు అందించామని తెలిపింది. ఇక విద్య, వైద్య సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. అందరికీ సరిపడా అందుతున్నాయా అంటే.. సంతృప్తికరం అని చెప్పలేం కానీ.., నిన్నటి కంటే ఈ రోజు మెరుగు అని మాత్రం చెప్పగలిగే స్థితిలో భారత్ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. 


ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా పురోగమనమే..!


స్వాతంత్ర్యం వచ్చిన 75ఏళ్లకు కూడా భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెబుతున్నారు.  దేశ జనాభాలో ఇప్పటికీ సగం మందికిపైగా పేదరికంలోనే ఉన్నారు.  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న  ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్‌లో ఇంతమంది పేదలు ఉండటం ఖచ్చితంగా వైఫల్యమే. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. కానీ పేదలు మాత్రం పైకి రావడం లేదు. పేదరికం తగ్గిపోయిందని ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉండవచ్చు. కానీ ప్రభుత్వం నిర్దేశించుకున్న మొత్తం కన్నా ఒక్క పైసా సంపాదించుకున్నా వాళ్లు పేదలు కాదనడం... మనల్ని మనం మోసం చేసుకోవడమే.  దేశంలో విద్య, వైద్యం అందని వారంతా పేదలుగానే భావించాల్సి ఉంటుంది. ఇటీవలి కరోనా మహమ్మారి సమయంలో  ఆ వైరస్ బారిన పడి ఎంత మంది  .ఎన్ని లక్షల కుటుంబాలు అప్పులపాలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనిక.. పేద తేడా లేదు. అందరూ ఆస్తులు కోల్పోయారు. అప్పుల పాలయ్యారు. కేవలం రేషన్ కార్డు ఉన్న వారే పేదవాళ్లు.. మిగతా వాళ్లెవరూ కాదనడం ఎంత మూర్ఖత్వమో.. ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకున్న రోజునే నిజమైన పేదరిక నిర్మూలనకు బీజాలు పడతాయి. ఈ 74 ఏళ్ల భారతావనిలో ప్రభుత్వాలు అంత విశాలంగా ఆలోచించకపోవడమే ఇప్పటి వరకూ  చోటు చేసుకున్న విషాదం. 


ఇప్పటికీ వదలని జాడ్యాల వల్లే వెనుకబడుతున్నాం...!


శతాబ్దానికి మూడు వంతులు గడిచిపోయింది.  టెక్నికల్‌గా మనం ఎక్కడకో పోయాం. చంద్రుడ్ని అదుకుంటున్నాం. ఆకాశానికి నిచ్చెనలేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వైద్య రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో భారతీయులే గ్రేట్ అన్న పేరు తెచ్చుకుంటున్నారు. కానీ.. అదే సమయంలో కాస్త వెనక్కి తిరిగి చూస్తే .. మన నలుపు మనకే అసహ్యమేస్తూ ఉంటుంది. దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నా, అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలన్నా అది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. కానీ ప్రజలు వదిలించుకోలేని సమస్య కులం, మతం . దేశం తరపున ఎవరైనా ఓ గొప్ప విజయం సాధిస్తే ముందుగా అతని కులం ఏమిటి అని వెదికే వారి సంఖ్య ఇండియాలో ఎక్కువ. ఓ మతం వారు విజయం సాధిస్తే ఆ మతం కనుక ప్రశంసించేవారూ తగ్గిపోతారు. దీనికి సాక్ష్యం హాకీ క్రీడాకారిణి వందన కటారియా ఉదంతం. ఆమె ఒలింపిక్స్‌లో సర్వశక్తులు ఒడ్డి దేశానికిప తకం తెచ్చేందుకు ప్రయత్నిస్తూంటే... ఇండియాలో ఆమెఇంటిపై కులపరమైన దాడిజరిగింది. దీనికి స్వతంత్ర భారతావని మొత్తం సిగ్గుపడాల్సిందే. ఇక్కడ తప్పు.. వందనా కటారియా కుటుబంపై కులపరమైన దాడి చేసిన వారిది కాదు.. అలాంటి మనస్థత్వాన్ని వదిలించుకోలేకపోయిన భారతీయులది. ఆ విషయంలో 74 ఏళ్లలో మనం సాధించింది చాలా స్వల్పం. ఇంకా విశాలం చేసుకోవాల్సిన అభిప్రాయాలు అనంతం ఉన్నాయి. కానీ రాను రాను దేశంలో కులాల పరిస్థితి దుర్భరంగా మారుతోంది.  సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాలు సైతం తమకూ రిజర్వేషన్లు కావాలని డిమాండు చేస్తున్న  పరిస్థితి నెలకొంది.  


రాజకీయ వ్యవస్థ సంయమనం పాటిస్తే అంతా మంచే..!


భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.  అయితే ఆ ప్రజాస్వామ్య పునాదులు ఈ 74 ఏళ్లలో బలపడ్డాయా... బలహీనపడ్డాయా అని విశ్లేషించుకుంటే.. రెండోదే నిజం అని అంగీకరించక తప్పని పరిస్థితి. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే... వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేయాలి.  కానీ దేశంలో ప్రతి వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. న్యాయవ్యవస్థ సహా.. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు అన్నీ ఏదో ఓ సందర్భంలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం రాజకీయ వ్యవస్థే. ప్రజలు ఇచ్చిన అధికారంతో మిగతా వ్యవస్థలను అదుపు చేయాలని రాజకీయ వ్యవస్థ అంతకంతకూ భావిస్తూ పోతూండటమే సమస్యలకు మూలం అవుతోంది. అదే ప్రజాస్వామ్యానికి పెను సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అతి క్లిష్టమైనసమస్య కూడా ఇదే కావొచ్చు. 


భవిష్యత్ అంతా భారత్‌దే..!


సమస్యలు అంటూ లేని మనిషి ఎలా ఉండడో.. అలాగే సమస్య అంటూ లేని దేశం కూడా ఉండదు. ఆ సమస్యలను ఎంత పకడ్బందీగా అధిగమిస్తారో... ప్రజలు ఎంత వివేకంగా ఉంటారో... వాళ్లని పాలించే వాళ్లు దేశం పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో అన్నదానిపైనే దేశం పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అదృష్టవశాత్తూ ఈ విషయంలో భారత్‌కు అన్నీ మంచి సూచనలే ఉన్నాయి.. ఈ 75వ స్వాతంత్ర్య వేడుకల్ని...  తిరంగా రెపరెపలతో.. ఘనమైన వారసత్వ సంపదతో.. మొక్కవోని భవిష్యత్ సంకల్పంతో భారతావని మున్ముందుకు దూసుకుపోయేలా ఉంటుందని ఆశిద్దాం..    


హ్యాపీ ఇండిపెండెన్స్ డే