PM Schedule: ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన పేర్కొన్న మేరకు తిరుపతిలోని ఐఐటీ(IIT), ఐసర్(IISER) తోపాటు విశాఖలో ఐఐఎం(IIM) వంటి కేంద్ర విద్యా సంస్థలకు సొంత భవనాలు సమకూరాయి. ఇన్నాళ్లు అద్దె భవనాల్లో కొనసాగిన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు  నేడు సొంత భవనాల్లో కొలువుదీరాయి. నేడు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు.


కేంద్ర విద్యా సంస్థలు
శాస్త్ర, సాంకేతిక రంగంలో  అద్భుతాలు సృష్టిస్తూ , సరికొత్త ఆవిష్కరణలకు  తోడ్పాడు అందిస్తూ విద్యావ్యాప్తికి  పునాదులు వేస్తున్న  తిరుపతి ఐఐటీ(IIT), ఐసర్(IISER) సంస్థలు నేడు సొంత భవనాల్లో కొలువుదీరాయి. విభజన హామీల్లో భాగంగా  రాష్ట్రానికి కేటాయించిన తిరుపతి(Tirupati) ఐఐటీ, ఐసర్ భవనాలు  ఇన్నాళ్లు అద్దె భవనాల్లో  కొనసాగాయి.  తిరుపతి సమీపంలోని ఏర్పాడు సమీపంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఐఐటీ, ఐసర్ భవనాలను నేడు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు.


ప్రారంభోత్సవ సందడి
2017లో కేంద్రంలో బీజేపీ(BJP), రాష్ట్రంలో తెదేపా ఉన్న సమయంలో జాతీయ విద్యా సంస్థలకు శంకుస్థాపన చేశారు. వీటికి ప్రధాని నరేంద్రమోదీ ఆన్‌లైన్‌ ద్వారా మంగళవారం జాతికి అంకితం చేశారు. ఏర్పేడుకు సమీపంలోని శ్రీనివాసపురంలోని 255 ఎకరాల విస్తీర్ణంలో ఐసర్‌(IISER) భవనాల నిర్మాణాలు చేపట్టారు.  తొలుత తిరుపతికి సమీపంలో తాత్కాలిక తరగతి గదులు నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.2117 కోట్ల వ్యయంతో ఇక్కడ అత్యాధునికంగా భవనాలు నిర్మించారు. సుమారు 1500 మంది విద్యార్థులు విద్యా భ్యాసం సాగిస్తున్నారు. సాంకేతిక విద్యను విద్యార్థులకు అందుబాటులోనికి తీసుకురావడంతో పాటు స్థానికతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా ఐఐటీ(IIT) ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏర్పేడుకు సమీపంలోని నంది కొండలను ఆనుకుని సుమారు 578 ఎకరాల్లో ఈ భవన నిర్మాణాలను చేపట్టారు. ఇక్కడ 1550 మంది విద్యార్థులు ఉన్నారు.


శాశ్వత భవనంలోకి ఐఐఎం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటి అయిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM) విశాఖపట్నం శాశ్వ­ త క్యాంపస్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ  వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. 2015 నుంచి ఐఐఎం విశాఖ(Vizag) కార్యకలాపాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ఆనందపురం, గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాల్ని ఉచితంగా కేటాయించింది. ఇందులో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో రూ.472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్‌ ఏరియాని అభివృద్ధి చేశారు.  అడుగడుగునా అద్భుతమనేలా హరిత భవనం (గ్రీన్‌ బిల్డింగ్‌), స్మార్ట్‌ భవనంగా దీన్ని తీర్చిదిద్దారు. 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ ప్లాంటును నిర్మించారు. దీని ద్వారా సంవత్సరానికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధులు ‘యు’ ఆకారంలో కూర్చొనేలా తరగతి గదులు నిర్మించారు.  


హైదరాబాద్ ఐఐటీ జాతికి అంకితం
అటు తెలంగాణలోని  ఐఐటీ హైదరాబాద్‌( IIT Hyderabad)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు కోసం కంది గ్రామంలో 576 ఎకరాలు కేటాయించగా, ఫిబ్రవరి 27, 2009లో అప్పటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20వేల మంది విద్యార్థులతో పాటు 10వేల మంది బోధన, ఇతర సిబ్బంది కోసం క్యాంపస్‌ నిర్మాణాన్ని 2010లో ప్రారంభించారు. భారత ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా సంస్థ కలిసి 2019 వరకు మొదటి దశ నిర్మాణంపనులు పూర్తి చేశాయి. జూలై 2015లో ఐఐటీ హైదరాబాద్‌ను ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి కందిలోని శాశ్వత క్యాంపస్‌లోకి మార్చారు. మొదటి దశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా కలిసి సుమారు రూ.1700 కోట్లు ఖర్చు చేశాయి.