సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రక్షణశాఖ నూతన భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, సైన్యాధిపతి ఎమ్ఎమ్ నరవాణే హాజరయ్యారు.










 

ఈ నూతన భవనాలను ప్రధాని లోపలికి వెళ్లి సందర్శించారు. అత్యాధునిక హంగులు, సాంకేతికత, సౌకర్యాలతో ఈ కాంప్లెక్స్‌లను నిర్మించారు.

 

భారీ వ్యయంతో..

 

రక్షణశాఖలో పనిచేసే 7000 మందికి పైగా ఉద్యోగులు ఈ భవనాల్లోకి మారనున్నారు. వీరు ప్రస్తుతం దిల్లీలోని 27 వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. 


సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూర్బా గాంధీ మార్గ్‌, ఆఫ్రికా అవెన్యూ ప్రాంతాల్లో రూ.775 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించిన రెండు నూతన భవనాల్లోకి వీరు మారనున్నారు. 


ప్రత్యేకతలు..



  1. సౌత్‌బ్లాక్ వద్ద ఉన్న దల్‌హౌసీ రోడ్‌లో గల ప్రస్తుత రక్షణ కార్యాలయాన్ని ప్రధాని నివాసం సహా నూతన కార్యలయం కోసం అభివృద్ధి చేయనున్నారు. 

  2. ఆఫ్రికా అవెన్యూ బిల్డింగ్ మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మించారు. 5.08 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న భవనం మూడు బ్లాకులతో 4.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 

  3. ఈ రెండు కాంప్లెక్స్‌లలో మొత్తం 1500 కార్లు పార్క్ చేసే సామర్థ్యం ఉంది. ఈ రెండు భవనాల్లో అత్యాధునిక సౌకర్యాలు సహా వైఫై కనక్టివిటీ, క్యాంటిన్లు, బ్యాంకు సేవలు వంటి సదుపాయాలు ఉన్నాయి.

  4. సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా గృహ నిర్మాణ శాఖ, నగర అభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఈ నూతన భవనాలను నిర్మించాయి. హరిత వాతావరణంలో ఈ భవనాలు ఉన్నాయి. 

  5. భవనాలు నిర్మణ సమయంలో అక్కడ ఉన్న చెట్లను నరికివేయకుండా వాటిని అలానే ఉంచినట్లు అధికారులు తెలిపారు.