దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో అతి కొద్దీ కాలంలో చాలా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  వందే భారత్‌తో ఈ ప్రక్రియకి  తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరో మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైంది. వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన  లభిస్తున్న నేపథ్యంలో ఈ - రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది . ఇందులో భాగంగానే  ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో భారతదేశపు మొట్టమొదటి వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారంలో  ప్రారంభించనున్నారు. నవరాత్రి పర్వదినాల్లో ప్రారంభిస్తున్న ఈ ట్రైన్‌ను మహిళలు నడపనుండటం విశేషం. 


దీంతో దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం చేస్తున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా చరిత్రలో నిలిచిపోతుంంది ఈ ర్యాపిడ్‌ ఎక్స్‌ ట్రైన్‌. దేశ రాజధానిలో ప్రయాణికుల రద్దీని తగ్గించడం, రోడ్డుపై వాహనాల సంఖ్యను తగ్గించడం, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా డీకార్బనైజేషన్‌కు సహకరించడమే లక్ష్యంగా ఈ రైలును పట్టాలెక్కించనున్నారు. మొదటిగా ఈ రైళ్లు ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో అందుబాటులోకి  రానున్నాయి. అదే గనుక జరిగితే ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. 


ఈ ట్రైన్ ప్రారంభోత్సవానికి వేదికగా నిలుస్తున్న ఈ కారిడార్ నిర్మాణ పనులు ఇప్పటికి నాలుగు నెలల క్రితమే పూర్తయ్యాయి.  ఢిల్లీ, మీరట్‌లను కలిపే ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) పర్యవేక్షిస్తుంది.  ఈ పేరులోని X  నెక్స్‌ట్ జెనరేషన్ టెక్నాలజీ, న్యూ ఏజ్ మొబిలిటీ సొల్యూషన్స్, వేగం, పురోగతి, యువత, ఆశావాదం, శక్తిని సూచిస్తుందని NCRTC చెబుతోంది. అలాగే  ప్రయాణికుల కోసం‘RAPIDX Connect’ అనే మొబైల్‌ యాప్‌ను కూడా ఆవిష్కరించాలని యోచిస్తోంది.


ఇక ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్స్ ఆరు కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో సహా అనేక ఆధునిక ఫీచర్‌స్ ఉన్నాయి. ఈ కోచ్‌లలో నాలుగు స్టాండర్డ్ కోచ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రీమియం కోచ్‌తో పాటు రిక్లైనింగ్ సీట్లు, ఎక్స్‌ట్రా లెగ్‌రూమ్, ప్రత్యేక లాంజ్  అందుబాటులో ఉంటాయి.  మెట్రో రైలు గంటకు 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ర్యాపిడ్ఎక్స్ రైల్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ర్యాపిడ్ఎక్స్ రైలులో అడ్జస్టబుల్ చైర్లు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఏసీ సిస్టమ్, ఆటోమేటిక్ డోర్ కంట్రోల్ సిస్టమ్, లగేజ్ స్టోరేజ్ స్పేస్, పెద్ద కిటికీలతో ఈ రైలు అత్యాధునికంగా కనిపిస్తుంది. ఈ రైళ్లలో ఢిల్లీ మెట్రో మాదిరిగానే మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన కోచ్ కూడా ఉంది. ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు, ఆన్‌బోర్డ్ వైఫై , పబ్లిక్ అనౌన్స్‌మెంట్, డిస్‌ప్లే సిస్టమ్, డైనమిక్ రూట్ మ్యాప్ డిస్‌ప్లేలు ఉంటాయి. అలాగే  వీల్‌చైర్‌ల కోసం నిర్దేశించిన ప్రాంతాలు, అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్‌కామ్ ద్వారా డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేసే ఎమర్జెన్సీ అలారం సిస్టమ్‌ కూడా ఈ ట్రైన్‌లో ఉంది.  ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే ఈ రూట్‌లో నిత్యం సంచరించే లక్షలాది వాహనాలను సంఖ్య కొంతమేరకైనా తగ్గించినట్టవుతుందని అధికారులు చెబుతున్నారు.