ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై సుప్రీం కోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వం వహించనున్నారు.







ఈ కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రాతోపాటు పంజాబ్-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ సెక్యూరిటీ ఏడీజీ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ ఏకపక్షంగా జరగకూడదన్న పంజాబ్ ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. 


ఏం జరిగింది?

 

పంజాబ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. అయితే మార్గ మధ్యంలో ఓ ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్‌ను కొంత మంది నిరసనకారులు అడ్డుకున్నారు. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది. దీంతో ప్రధాని మోదీ తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లారు. అటు నుంచి దిల్లీకి పయనమయ్యారు.


ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


అయితే భద్రతా వైఫల్యాల వల్లే ప్రధాని పర్యటన రద్దయిందనే వాదనను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. అసలు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తున్నారనే సమాచారమే తమకు అందలేదన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంపై చింతిస్తున్నామన్నారు.


Also Read: Covid Cases: దేశంలో కొత్తగా లక్ష 94 వేల మందికి కరోనా.. 5 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు


Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి