Patna High Court  : ఎన్నికల రాజకీయాల కోసం రిజర్వేషన్ల పెంపును చేపట్టే పార్టీలకు పాట్నా హైకోర్టు గట్టి సందేశాన్ని పంపింది. 65  శాతం రిజర్వేషన్ల పెంపు చెల్లదని స్పష్టం చేసింది. గతేడాది బీహార్‌ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచింది. గతంలో కులగణన అనేది రాజకీయ అంశం అయింది. బీహార్ ప్రభుత్వం వేగంగా కులణన చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా  బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ బీహార్‌లోని నితీష్ కుమార్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  సవరించిన రిజర్వేషన్ కోటాలో షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 2 శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 43 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులు ఉన్నాయి. ఈ నిర్ణయం ఓపెన్ మెరిట్ కేటగిరీ నుంచి వచ్చే వారికి 35 శాతానికి పరిమితం చేసింది.


బీహార్‌లో మొత్తం 75శాతం రిజర్వేషన్లు            


ఈ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కలిపితే 75  శాతానికి చేరుతాయి.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు.. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపును రద్దు చేసింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు నిచ్చింది. ఇవి  రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. వాటిని రద్దు చేస్తున్నామని పట్నా హైకోర్టు ప్రకటించింది.  


ప్రతీ రాష్ట్రంలోనూ రిజర్వేషన్ల పెంపు రాజకీయం            


రిజర్వేషన్ల పెంపు అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్న రాజకీయం. వివిధ సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి వస్తుండడంతో వివిధ రాష్ట్రాలు ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, వాటికి సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని ఇందిరా సాహ్నీ - యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు న తీర్పు ఇచ్చింది. దీనికి మండల్‌ తీర్పుగా ప్రస్తావించింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతంగా ఉంటూ వస్తోంది.  
తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో కొన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేశాయి. 


ఒక్క తమిళనాడులోనే యాభై శాతానికి మించి  రిజర్వేషన్లు              


ఒక్క తమిళనాడులో మాత్రమే .. యాభై శాతానికి మంచి రిజర్వేషన్లు ఉన్నాయి. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం ద్వారానే తమిళనాడులో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే, ఇప్పటికీ అది కోర్టుల పరిధిలో ఉంది.  కోర్టు తీర్పులు ఆటంకంగా మారడంతో తాము చేసిన రిజర్వేషన్ల చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కానీ కేంద్రం మాత్రం అలాంటి డిమాండ్లను పట్టించుకోవడం లేదు. బీహార్ సర్కార్ ఇచ్చిన రిజర్వేషన్లు కులగణన ఆధారంగా ఉన్నాయి. అందుకే ఇతర రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న డిమాండ్ వినిపించింది. ఇప్పుడు కోర్టు తీర్పు తర్వాత కులగణన డిమాండ్ కూడా చల్లబడే అవకాశం ఉంది.