Parliament Winter Session: చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్!

ABP Desam Updated at: 19 Dec 2022 05:14 PM (IST)
Edited By: Murali Krishna

Parliament Winter Session: భారత్- చైనా సైనికుల ఘర్షణపై చర్చకు రాజ్యసభ ఛైర్మన్ నిరాకరించడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్!

NEXT PREV

Parliament Winter Session: చైనా, భారత్ మధ్య సరిహద్దులో జరిగిన తాజా ఘర్షణపై చర్చకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్షాలు.. ఉభయ సభల్లో మరోసారి పట్టుబట్టాయి. ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు.. రాజ్యసభ ఛైర్మన్‌ను కోరాయి. కానీ ఇందుకు సభాపతి నిరాకరించడంతో విపక్ష సభ్యులంతా ఉమ్మడిగా సభ నుంచి వాకౌట్ చేశారు. 



చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ అంశం గురించి చర్చించకపోతే, ఏ అంశం గురించి చర్చిస్తారు. ఈ అంశం గురించి సభలో చర్చించడానికి మేము సిద్దంగా ఉన్నాం.                     -   మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు 


అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో జరిగిన భారత్ చైనా సైనికుల ఘర్షణ తర్వాత నుంచి ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చకు ఉభయ సభలలో పట్టు పడుతున్నాయి.


రక్షణ శాఖ


రక్షణ మంత్రిత్వ శాఖ గత శనివారం తన సంవత్సరాంతపు సమీక్షలో భారత సైన్యం.. ఆయుధ ఆధునీకరణ సహా పలు అంశాలపై మాట్లాడింది.



ఇతర దేశాలు జరిపే  ఆకస్మిక దాడులు, శత్రు దేశాల దూకుడు చర్యలను ఎదుర్కోవడానికి భారత రక్షణ శాఖ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. సరిహద్దులు, వాస్తవ నియంత్రణ రేఖ, నియంత్రణ రేఖ వెంబడి ఆధిపత్యాన్ని కొనసాగించాలని, అప్పుడప్పుడు జాతీయ భద్రతకు తలెత్తుతున్న ముప్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమీక్షించడంపై సైన్యం దృష్టి సారించింది.  భారత్, పాకిస్థాన్ సరిహద్దు అయిన నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పరిస్థితి శాంతియుతంగా ఉంది. 2020 సంవత్సరంలో 4,625 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించారు. 2021లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కేవలం మూడు ఘటనలు జరిగాయి. అందులో 2022 సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క ఘటన జరిగింది.                   -    రక్షణ శాఖ


ఇదీ జరిగింది 


డిసెంబర్ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. 


ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.


Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై డ్రోన్‌లతో రష్యా భీకర దాడులు

Published at: 19 Dec 2022 05:08 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.