పొత్తులపై పవన్‌ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. సత్తెనపల్లిలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇందులో 2014 కూటమి ప్రస్తావించిన పవన్ కల్యాణ్‌... వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనియ్యకుండా చూస్తామన్నారు. ఇంతకీ పవన్ లెక్కేంటి? 2014 ప్రస్తావ ఎందుకు వచ్చింది.  


2014లో గెలిచిన కూటమి కొన్ని కారణాల వల్ల 2019లో పోటీ చేయలేదని... అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్.  ఆ కూటమి ఉంటే బలమైన విపక్షంగా అయినా పోరాడే అవకాశం ఉండేది అన్నారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పొలిటికల్ పాయింట్‌. ఇంతకీ పవన్‌ అంతరంగం ఏంటీ? అధికారంలోకి వచ్చేది జనసేన అంటూనే... 2014 నాటి పొత్తుల అంశం ఎందుకు ప్రస్తావించారని చాలా మంది విశ్లేషించుకుంటున్నారు. 


వ్యూహాన్ని నాకు వదిలేయండి.. ప్రజల పక్షాన పోరాడుదాం... పార్టీ అధికారంలోకి రప్పించే బాధ్యత నాది అంటూ పవన్‌ సత్తెనపల్లి వేదికగా ప్రకటించారు. ఓవైపు అధికారంలోకి వస్తామంటూనే మరోవైపు పొత్తుల అంశం తెరపైకి ఇండైరెక్ట్‌గా తీసుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా చూస్తానంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాని చెబుతున్నారు. ఇక్కడే  పవన్‌ కన్ఫ్యూజ్ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో కన్ఫ్యూజ్‌ ఏమీ లేదని... భవిష్యత్ రాజకీయాలపై పవన్‌కు ఫుల్‌ క్లారిటీ ఉందని అందుకే ఏ మాటైనా ఆలోచించే చెబుతున్నారని జనసేన లీడర్లు అంటున్నారు. సత్తెనపల్లిలో స్పీచ్‌ కూడా అలాంటిదేనంటున్నారు. 


పవన్ ఎందుకు అలా అన్నారు?
భవిష్యత్‌లో వైసీపీ చేసే రాజకీయాలన్నీ హింసాత్మకంగానే ఉంటాయన్నారు పవన్ కల్యాణ్‌. అందుకు ఉదాహరణగా మాచర్లలో జరిగిన ఇన్సిడెంట్‌ను ప్రస్తావించారు. అందుకు పార్టీ లీడర్లు సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. మళ్లీ వైసీపీని గెలిపిస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్లిపోతుందని అభిప్రాయపడ్డారు పవన్. రాష్ట్రంలో స్థిరత్వం కలిగిన అభివృద్ధి ఆకాంక్షించే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగానే  2014 కూటమి అంశాన్ని ప్రస్తావించారు. 


పవన్ ప్రస్తావించిన 2014 కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి టీడీపీ మాత్రమే బయట ఉంది. ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు ఓ సందర్భంలో కలిశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేయాలని నిర్ణయించారు. దీంతో 2014 కూటమి సీన్‌ మరోసారి రిపీట్ అవుతుందని చాలా మంది అంచనాలు వేసుకున్నారు. కానీ తర్వాత ఆ భేటీ ప్రభావం కానీ దాని కొనసాగింపు సమావేశాలు కానీ ఎక్కడా కనిపించడం లేదు. మరోసారి ఆ అంశాన్ని రెండు పార్టీల్లో ఎవరూ ప్రస్తావించలేదు. ఆ పార్టీ మధ్య చర్చకు రాలేదు కూడా.


చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ జరిగిన కొన్ని రోజులకే ప్రధానితో జనసేనాని భేటీ అయ్యారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఊహించుకుంటున్నారే తప్ప అసలు ఆ సమావేశంలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో కూడా ఎవరూ చెప్పలేదు. మోదీతో సమావేశం తర్వాత పవన కల్యాణ్‌ స్వరంలో మార్పు వచ్చిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. వాటిని సమర్థిస్తున్నట్టే పవన్ కల్యాణ్‌ కూడా మాకు ఒక్క ఛాన్స్‌ అంటూ నినాదించారు.


తర్వాత మళ్లీ సమావేశాల్లో మాట్లాడిన పవన్ కల్యాణ్‌.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనంటూ ప్రకటన చేస్తూ ఆ కూటమి ఉంటుందన్న ఎత్తుగడను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త పాయింట్ తీసుకురావడంతో అందరిలో మళ్లీ ఆసక్తి నెలకొంది. టీడీపీకి లైన్‌ క్లియర్‌ అయిందా అన్న సందేహం చాలా మందిలో నెలకొంది. 


జనసేనను టార్గెట్ చేసి వైసీపీ...
పొత్తుల వ్యవహరంపై టీడీపీ, జనసేన ఓ క్లారిటీతో పని చేస్తున్నాయని పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. బీజేపీ మాత్రం డిసైడ్‌ చేసుకోలేకపోతుందన్న వాదన ఉంది. టీడీపీని దరి చేరనిచ్చేది లేదంటూనే చేజారిపోతున్న పవన్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ వైసీపీ రాజకీయాలు నడిపిస్తోంది. బీజేపితో కలసి ఉన్న పవన్ టీడీపీతో వెళ్ళటం ఖాయం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో వైసీపీ నేతలు ఎక్కువగా శ్రద్ద చూపిస్తున్నారు. దీని వలన బీజేపితో జనసేన దోస్తీపై ప్రభావం చూపించటతోపాటు, తాము సింగల్‌గా పోటీ చేస్తున్నామనే సింపతీ రెచ్చగొట్టాలని చూస్తోంది. దీని వలన అటు టీడీపీ కూడా చెక్ పెట్టేందుకు వీలుంటుందని, పరోక్షంగా బీజేపికి కూడా రాజకీయంగా మెసేజ్ వెళ్తుందన్నది వైసీపీ అంచనాగా చెబుతున్నారు.


పవన్ మాటేంటి...


వైసీపీ రాజకీయంగా జనసేనను టార్గెట్ చేసిన ప్రశ్నలకు ఇంతవరకు పవన్ నుంచి సమాధానం లేదు. జనసేన సింగల్‌గా పోటీ చేస్తుందా? రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కనీసం జనసేనకు అభ్యర్థులు ఉన్నారా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. వీటిపై పవన్ ఇంత వరకు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. కానీ వైసీపీని అధికారంలోకి రానివ్వబోమంటూ ప్రకటన చేస్తున్నారు. ప్రభుత్వ ఓటును చీల్చబోనీయమని పదే పదే చెబుతున్నారు. దీనిపై మరింత క్లారిటీ ఇచ్చేందుకే 2014 నాటి కూటమి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని టాక్ నడుస్తోంది. అంటే 2014నాటి పొత్తులను పవన్ ఆశిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పారని... ప్రజలను, పార్టీ కేడర్‌ను దీనికి సిద్ధం చేయడానికే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


బీజేపీ ఏం చెప్పబోతుంది?


పవన్ కల్యాణ్‌తో పొత్తులో ఉన్న బీజేపీ... తమ రెండు పార్టీలే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నారు ఆ పార్టీ లీడర్లు. టీడీపీని కలుపుకొని వెళ్లే ప్రసక్తి లేదన్నది వారి అభిప్రాయం. కానీ పవన్ మాత్రం ఓటు చీలిపోనివ్వబోమంటూనే... 2014 కూటమి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.