Pakistan-US Relations: 


నాన్ నాటో స్టేటస్ తీసేస్తారా? 


పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైంది. ఓ పూట తిండి తినడానికి కూడా అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సాయం చేయాలంటూ ప్రభుత్వం ఇరుగు పొరుగు దేశాలను అర్థిస్తోంది. ఉగ్రవాదులను పెంచి పోషించిన ఆ దేశం...ఇప్పుడు అదే ఉగ్రవాదంతో పోరాడలేక చేతులెత్తేసింది. ఇలాంటి కష్టకాలంలో గోరుచుట్టుపై రోకలి పోటు అన్నట్టు మిత్రదేశంగా భావించిన అమెరికా కూడా పాక్‌కు షాక్ ఇచ్చింది. పాక్‌కు "నాన్ నాటో" (Non NATO) స్టేటస్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అఫ్గనిస్థాన్‌ను తొలగించిన అమెరికా...ఇప్పుడు పాక్‌నూ ఆ జాబితాలో చేర్చనుంది. హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో ఓ ఎంపీ ఈ బిల్‌ను
ప్రవేశపెట్టారు. ఆ తరవాత సెనేట్‌లో ప్రవేశపెడతారు. చివరకు అధ్యక్షుడు బైడెన్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... పాక్‌కు వ్యతిరేకంగా పెట్టిన ఈ బిల్లు పాస్ కాలేదు. అయినా...ఆ దేశంపై అమెరికా ఎంత గుర్రుగా ఉందో అర్థమవుతోంది. పాకిస్థాన్‌ కూడా ఈ స్టేటస్ పోగొట్టుకోకుండా అధ్యక్షుడు బైడెన్‌తో సంప్రదింపులు జరిపేందుకు వీలుంటుంది. బైడెన్ ఓ సర్టిఫికేట్ జారీ చేస్తే చాలు...నాన్ నాటో స్టేటస్‌ అలాగే కొనసాగుతుంది. అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక...అమెరికా అఫ్గనిస్థాన్‌కు నాన్ నాటో స్టేటస్‌ను తొలగించింది. 1987లో Non NATO Alliesని ప్రారంభించింది అమెరికా. బహ్రెయిన్, బ్రెజిల్, ఈజిప్ట్, ఇజ్రాయేల్, జపాన్, జోర్డాన్, కువైట్, మొరాకో దేశాలకూ ఈ స్టేటస్ కల్పించింది అగ్రరాజ్యం. 


అల్లాడుతున్న జనం..


పాక్ ప్రజలు కనీస సౌకర్యాలకూ అల్లాడిపోతున్నారు. మ్యారేజ్‌ హాల్స్‌, మార్కెట్‌లు, వ్యాపార సముదాయాలు అన్నీ బంద్ చేశారు. ఇక చమురు ధర కూడా అక్కడి ప్రజలకు చురకలు అంటిస్తోంది. చమురు వినియోగం కోసం దిగుమతులపైనే ఆధార పడుతోంది పాక్. ఫలితంగా...పెట్రో ధరలూ మండి పోతున్నాయి. అన్ని ఆఫీస్‌ల్లో విద్యుత్ వినియోగాన్ని 30% వరకూ తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. 
విదేశీ మారక నిల్వలు అనూహ్య స్థాయిలో పడిపోయాయి. దాదాపు 6.7 బిలియన్ డాలర్ల మేర కోత పడింది. పాక్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనా కూడా ఈ మధ్య కాలంలో వెనక్కి తగ్గింది. ఫలితంగా...పరిస్థితులు మరింత దిగజారాయి. రాజకీయంగానూ స్థిరత్వం లేకపోవడం మరో సవాలు. ఇక ఫ్యాన్‌లు, లైట్‌లు వెలగడంపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఏడాది జులై వరకూ ఈ నిబంధనలు పాటించాల్సిందే. వీధి దీపాలూ వెలగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలూ అందడం లేదు. పేదరికంతో విలవిలలాడుతున్నారు ప్రజలు. రెండేళ్లలో పేదల సంఖ్య 35.7% మేర పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల జాబితాలో 92వ స్థానంలో ఉంది పాక్. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని గిల్గిట్ బాల్టిస్థాన్‌లోనూ అలజడి మొదలైంది. ఇప్పటికే ఇక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో గిల్గిట్ బాల్టిస్థాన్‌ను విలీనం చేయాలన్న కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Delhi Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యే చేతుల్లో నోట్ల కట్టలు, షాక్ అయిన నేతలు