Pakistan Elections: 


పూర్తైన నియోజకవర్గాల పునర్విభజన


పాకిస్థాన్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో ఇక్కడ జనరల్ ఎలక్షన్స్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. నిజానికి ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది అక్టోబర్‌తో ముగుస్తుంది. కానీ..ఓ ఏడాది ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ECP).దీనిపై ఉన్న వివాదాలనూ పరిష్కరించింది. ఇదే విషయాన్ని అక్కడి ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ న్యూస్ పేపర్ వెల్లడించింది. "జాతీయ, ప్రావిన్స్ నియోజకవర్గాల పునర్విభజన పూర్తైంది" అని స్పష్టం చేసింది. ఆగస్టు 4వ తేదీలోగా నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేస్తామని, ఎన్నికల సంఘం గతంలోనే సుప్రీం కోర్టుకు హామీనిచ్చింది. ఈ నెలాఖరులోగా నియోజకవర్గాల జాబితాతో పాటు, ఓటర్ల లిస్ట్‌నూ ప్రకటిస్తామని వెల్లడించింది. చివరిగా 2018 జులైలో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగాయి. అయితే పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (PDM)మాత్రం గతవారం ఇందుకు భిన్నమైన ప్రకటన చేసింది. అనుకున్న విధంగానే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని, ప్రస్తుత అసెంబ్లీ గడువు పూర్తయ్యాకే ఎలక్షన్స్ నిర్వహిస్తారని చెప్పింది. 


ముందస్తు ఎన్నికలొకటే మార్గం: ఇమ్రాన్ ఖాన్


పాకిస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పాకిస్థాన్ తెహరీక్ ఇ ఇన్‌సాఫ్‌ (PTI)చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. "ప్రస్తుతం అనిశ్చితి తొలగిపోవటానికి ఒకే ఒక మార్గముంది. నన్ను ప్రధాని పదవి నుంచి తొలగించే సమయానికి, ఎన్నికల ప్రకటన చేశాను. కానీ, సుప్రీం కోర్టు నా నిర్ణయాన్ని పక్కన పెట్టింది.  ఇప్పుడు ముందస్తుగా ఎన్నికలు నిర్వహించటమే సరైన నిర్ణయమని ఇప్పటికీ భావిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)కో ఫౌండర్ అసిఫ్ అలీ జర్దారీ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపినట్టు...పాకిస్థాన్ అవామీ ముస్లిం లీగ్ (AML)చీఫ్ షేక్ రషీద్ వెల్లడించారు. ఎన్నికల తేదీని కూడా ట్వీట్ చేశారు. కొత్త ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగనున్నాయి.





  


Also Read: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లవ్‌పై రష్మిక షాకింగ్ రిప్లై, ఫ్యాన్స్ హర్ట్!


Also Read: Maharashtra Cabinet: మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు అంతా రెడీ! ఫడణవీస్ దిల్లీ పర్యటన అందుకేనా?