Nomad Plane Crash:


1976లో ప్లేన్ క్రాష్ 


47 ఏళ్ల క్రితం మలేషియాలో ఓ విమాన ప్రమాదం (Malaysia Nomad Plane Crash) జరిగింది. పలువురు రాజకీయ నాయకుల ప్రాణాలు బలి తీసుకుంది ఈ ఘటన. ఆ దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది సంచలనమైంది. కానీ...అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగింది.? అన్నది మాత్రం ఇప్పటికీ ఓ అంతు పట్టని మిస్టరీగా ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఈ మిస్టరీ వీడింది. ఆ ప్రమాదం జరగడానికి కారణమేంటో మలేషియా ప్రభుత్వం వెల్లడించింది. 1976లో జరిగిన ప్లేన్ క్రాష్‌పై రిపోర్ట్ తయారు చేసింది. విమానంలోని ఆస్ట్రేలియా తయారు చేసిన టర్బైన్ ఇంజిన్‌ని ప్రాపర్‌గా లోడ్ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఫలితంగా...పైలట్‌ ఫ్లైట్‌పై కంట్రోల్ కోల్పోయాడని వెల్లడించింది. ఎయిర్‌ క్రాఫ్ట్ మాల్‌ఫంక్షన్ కానీ, అగ్ని ప్రమాదం కానీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేని మలేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది. Nomad Planeని గవర్నమెంట్‌ ఎయిర్‌క్రాప్ట్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఆస్ట్రేలియా తయారు చేసింది. టర్బైన్ ఇంజిన్‌ సరిగ్గా లోడ్ అవకపోవడం వల్ల ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం అదుపు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్‌లో 10 మంది ఉన్నారు. పైలట్‌తోపాటు వీళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దీనిపై 21 పేజీల రిపోర్ట్ తయారు చేసింది మలేషియా. 1976లో జూన్ 6వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. అందుకే...ఈ ఘటన  Double Six (06-06-1976)గా పాపులర్ అయింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, హౌజింగ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్‌తో పాటు మరి కొందరు కీలక నాయకులు ఈ ప్రమాదంలో చనిపోయారు. త్వరలోనే ఈ రిపోర్ట్‌ను విడుదల చేస్తామని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. 


ఇంకా అనుమానాలు..


అయితే...ఇక్కడ మరి కొన్ని అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పైలట్ ఎలాంటి ఆల్కహాల్‌ కానీ, డ్రగ్‌ కానీ తీసుకున్నట్టు లేదు. కానీ అతడికి సంబంధించిన కొన్ని రికార్డులను తొలగించారు. ఓ రికార్డుని తగలబెట్టారు. మరోటి కనిపించకుండా పోయింది. అంతే కాదు. ట్రైనింగ్ పీరియడ్‌లో ఆ వ్యక్తి సరిగ్గా పెర్‌ఫామ్ చేయలేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగే ముందు పైలట్ అనారోగ్యానికి గురయ్యాడన్న వాదనలూ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఫ్లైట్‌లో ఇద్దరు పైలట్‌లు ఉంటారు. కానీ...ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల ఓ పైలట్‌ను దించేశారు. ఒకవేళ ఇద్దరు పైలట్‌లు ఫ్లైట్‌లో ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని చెబుతున్నారు అధికారులు. 1977 జనవరి 25వ తేదీనే క్రాష్ రిపోర్ట్ తయారైంది. కానీ ఇన్నిరోజుల పాటు అది వెలుగులోకి ఎందుకు తీసుకురాలేదన్నది మాత్రం మలేషియా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. పూర్తి స్థాయిలో విచారణ చేశాకే ఈ వివరాలు చెబుతున్నామని అంటున్నప్పటికీ అనుమానాలు మాత్రం ఇంకా వీడడం లేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చనిపోతే ఇన్నేళ్లు అలా సైలెంట్‌గా ఉంటారా..? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. 


Also Read: Asad Ahmed Encounter: పాకిస్థాన్‌నూ భయపెడుతున్న సీఎం యోగి, అసద్ ఎన్‌కౌంటర్‌తో వార్నింగ్