Asad Ahmed Encounter:



పాకిస్థాన్‌ నుంచే ఆయుధాలు


యూపీ మాఫియా డాన్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనమైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సర్కార్‌ను ఆకాశానికెత్తేస్తున్నారంతా. ఇప్పటికే బుల్‌డోజర్ సీఎంగా పేరు తెచ్చుకున్న యోగి...ఈ ఎన్‌కౌంటర్‌తో ఆ చరిష్మా మరింత పెరిగింది. యూపీలోని గూండాలకే కాదు. పాకిస్థాన్‌కూ చెమట పట్టిస్తున్నారు యోగి. మాఫియాపై ఆయన తీసుకుంటున్న చర్యలను చూసి పాక్ భయపడుతోంది. యూపీలో మాఫియా అనేదే లేకుండా చేయడమే తన లక్ష్యమని ఇప్పటికే యోగి తేల్చి చెప్పారు. అయితే అసద్ ఎన్‌కౌంటర్‌కు పాక్‌కు లింక్ ఏంటి..? అంటే అతనికి ఆయుధాలన్నీ పాకిస్థాన్‌ నుంచే వచ్చాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో పోలీసులపై ఆ తుపాకులతోనే పోలీసులపై ఫైరింగ్ మొదలు పెట్టాడు అసద్. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే...పాకిస్థాన్‌ నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు కొనుగోలు చేసింది అసద్ మాత్రమే. డ్రోన్‌ల ద్వారా అక్కడి నుంచి భారత్‌లోకి సరఫరా చేశారు. అందుకే...ఈ ఎన్‌కౌంటర్‌తో పాకిస్థాన్‌లోని మాఫియా కూడా ఉలిక్కి పడుతోంది. ఇప్పటికే మీడియా ముందుకొచ్చి పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్. అదో ప్రమాదకరమైన దేశమని తేల్చి చెప్పారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనా కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ నాయకత్వం స్వార్థంతో ఆలోచించడం వల్లే ఆ దేశ ప్రజలు కష్టాలు పడాల్సి వస్తోందంటూ ఆసహనం వ్యక్తం చేశారు. 


ఎన్‌కౌంటర్..


యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌ కొడుకు అసద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతడి హస్తమూ ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే Uttar Pradesh Special Task Force అసద్‌ను ఎన్‌కౌంటర్ చేసింది. డీఎస్‌పీతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. అసద్‌తో పాటు అతని సన్నిహితుడు గులాంపై కాల్పులు జరిపింది. వాళ్ల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకుంది. వీరిద్దరి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డు ఇస్తామని ఇప్పటికే యూపీ పోలీసులు ప్రకటించారు. ఈలోగా వాళ్ల జాడ తెలుసుకుని వెంటాడిన పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్‌ను హత్య జరిగిన సమయంలో సీసీటీవీలో అసద్ కూడా కనిపించాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చివరకు వాళ్ల ఆచూకీ కనుక్కొని ఎన్‌కౌంటర్ చేసింది. ముందు గులాం పోలీసులపై ఫైరింగ్ జరిపాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలోనే అసద్, గులాం ప్రాణాలు విడిచారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం..ఉమేశ్ పాల్ హత్య తరవాత అసద్ లక్నోకి పారిపోయాడు. అక్కడి నుంచి కాన్పూర్, మీరట్‌కు వెళ్లి చివరకు ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌కు పారిపోవాలని చూశాడు. ఝాన్సీ ప్రాంతానికి వచ్చిన అసద్ అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌ బార్డర్‌కు బైక్‌పై వెళ్లే క్రమంలోనే ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. అతిక్ అహ్మద్ గ్యాంగ్‌లోనే ఓ ఇన్‌ఫార్మర్‌ అసద్‌ ఆచూకీని పోలీసులకు చెప్పాడు. ఆ ఆధారంగా 12 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఝాన్సీలోని బబీనా రోడ్‌ వద్ద దాదాపు 42 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లోని అసద్‌, గులాం చనిపోయారు.