Parliament session: 'అరెస్ట్‌ల నుంచి సభ మిమ్మల్ని రక్షించలేదు- మీరూ సామాన్యులే'

ABP Desam   |  Murali Krishna   |  05 Aug 2022 05:34 PM (IST)

Parliament session: పార్లమెంటు కార్యక్రమాలు జరుగుతోన్న సమయంలో ఎంపీలను ఈడీ వంటి సంస్థలు విచారణకు పిలిస్తే హాజరు కావాల్సిందేనని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు.

'అరెస్ట్‌ల నుంచి సభ మిమ్మల్ని రక్షించలేదు- మీరూ సామాన్యులే'

Parliament session: పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఎంపీల‌ను విచారించడం, అరెస్టు చేసే అంశంపై రాజ్య‌స‌భ ఛైర్మన్ వెంక‌య్య‌ నాయుడు కీలక ప్రకటన చేశారు. సభా కార్యక్రమాలు జరుగుతోన్న వేళ ఎంపీలను అరెస్ట్ చేయడం లేదా ప్రశ్నించడంపై కొందరికి అపోహలు ఉన్నాయని ఆయన అన్నారు.

ఎంపీలు కూడా సాధార‌ణ వ్య‌క్తులే. క్రిమిన‌ల్ ఆరోప‌ణ‌లు ఉన్న కేసుల్లో సదరు ఎంపీల‌కు స‌భ ఎటువంటి ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేదు. స‌భ‌కు హాజ‌రుకావాల‌న్న ఉద్దేశంతో కేసుల విచార‌ణ నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌లేం. చ‌ట్టాన్ని, న్యాయ ప్ర‌క్రియ‌ను గౌర‌వించ‌డం మ‌న విధిగా భావించాలి. సభా కార్యక్రమాలు జరుగుతోన్న సమయంలో ఎంపీలను ఈడీ వంటి సంస్థలు విచారణకు పిలిస్తే హాజరు కావాల్సిందే.                                                     - వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్ 

విపక్షాల ప్రశ్న

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా? అంటూ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు ఈ విధంగా స్పందించారు. పార్లమెంట్​ సమావేశాలతో సంబంధం లేకుండా దర్యాప్తు సంస్థల విచారణకు హాజరుకావాలని సూచించారు. జులై 18న ప్రారంభమైన సమావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి.

కాంగ్రెస్ నిరసన

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ దాడులు సహా ప్రజా సమస్యలపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో శతాబ్దాలుగా ప్రజలు నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. 

ప్రజాస్వామ్యం చచ్చిపోతుంటే మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో శతాబ్దాలుగా ఇటుక ఇటుక పేర్చుకుంటూ మనం నిర్మించుకున్న దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేసేస్తున్నారు. ఈ నియంత రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడిన వారిపై దాడులు చేస్తున్నారు. జైలుకు పంపుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింసకు వ్యతిరేకంగా మాట్లాడకుండా విపక్షాల గళం నొక్కడమే వారి ఆలోచన. కేవలం నలుగురు, ఐదుగురు ప్రయోజనాలను కాపాడటం కోసం ఇద్దరు ముగ్గురు వ్యాపారుల సంక్షేమం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. పోరాడుతూనే ఉంటాను. నేను ఎంత పోరాడితే వాళ్లు నాపై అంతలా దాడి చేస్తారు. నాపై దాడి చేయండి. నేను సంతోషంగా స్వీకరిస్తాను.                                                               "

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Also Read: China Taiwan Issue: మేమంటే లెక్క లేదా? నాన్సీ పెలోసీపై ఆంక్షలు విధిస్తున్నాం: చైనా

Also Read: Thailand Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం- 13 మంది మృతి, 40 మందికి గాయాలు

Published at: 05 Aug 2022 05:30 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.