Telangana Government News: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సహజ ప్రసవాలు చేసిన వైద్య బృందానికి ₹3 వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సాధారణ ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


నిజామాబాద్ జిల్లాలో అధికంగా, కలెక్టర్ చర్యలు
రాష్ట్రంలో సిజేరియన్లను తగ్గించి.. నార్మల్ డెలివరీలు పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లను తగ్గించి నార్మల్ డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వైద్యారోగ్యశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రత్యేక వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు అయ్యేలా గర్బిణీలకు యోగా, వ్యాయమం వంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయితే నిజామాబాద్ జిల్లాలో సిజేరియన్లు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సగటున 10 మందిలో 8 మంది సిజెరియన్ తోనే పిల్లలు కంటున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో సిజేరియన్లు పెరగడంపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. నిబంధనలు పాటించని 54 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు కూడా జారీ చేశారు. 


జిల్లాలో పెరిగిన సిజేరియన్ల సంఖ్య 
జిల్లాలో ఇటీవలి కాలంలో సిజేరియన్ల సంఖ్య పెరిగింది. నార్మల్ డెలివరీ అయ్యేందుకు ఛాన్స్ ఉన్నప్పటికీ.. కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బులకు ఆశపడి అనవసరంగా సిజేరియన్లు చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌ లోని గైనిక్ ఆస్పిటల్స్ లో ఆ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రులలో సౌకర్యాలు, ఇతర వివరాలను ఆరా తీశారు. దాదాపు 10 రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. అనంతరం తనిఖీ బృందాలు నివేదికను రూపొందించి డీఎంహెచ్‌వోకు ఇచ్చారు.


తనిఖీ బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలోని మొత్తం 54 ఆస్పత్రులకు జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడం జరిగిందని అధికారులు వెల్లడించారు. నోటీసులు జారీ అయిన వాటిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 37 ఆస్పత్రులు, బోధన్‌లోని 8 ఆస్పత్రులు, ఆర్మూరులోని 9 ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం... ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలోని ప్రసూతి ఆసుపత్రిలో సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సి-సెక్షన్ తోనే 75 శాతం వరకు ప్రసవాలు జరగడం బాధాకరం. నిజామాబాద్ జిల్లాలో మే నెలలో 1,913 మంది గర్బిణీలు ప్రసవించగా.. అందులో 1,444 ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగాయి. 459 సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయి.


నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 100 శాతం సిజేరియన్‌లు జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయ్. ప్రైవేట్ ఆస్పత్రులు లాభార్జనే ధ్యేయంగా సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయ్. సిజేరియన్ల వల్ల మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయ్. ఒక్క సారి సిజేరియన్ అయిన తర్వాత నార్మల్ డెలివరీకి అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. మొదటి ప్రసవం సమయంలోనే నార్మల్ డెలివరీ అయ్యేలా గర్భిణీలకు వైద్యులు తగు సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.