Microsoft AI Skill Training: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల (Satya Nadella) కీలక ప్రకటన చేశారు. 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్కిల్స్‌పై యువతకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 20 లక్షల మంది విద్యార్థులకు AI స్కిల్క్‌పై ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌తో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించినట్టవుతుందని వివరించారు. ముంబయిలో జరిగిన Microsoft CEO Connection ఈవెంట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఈ సమయంలోనే AI స్టార్టప్‌ Karya సంస్థపై ప్రశంసలు కురిపించారు. గ్రామాల్లోని 30 వేల మందిని ఎంపిక చేసింది ఈ కంపెనీ. స్పీచ్, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ ద్వారా డేటా సెట్స్‌ని తయారు చేసేందుకు వీళ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. అంతే కాదు. వాళ్లకు కొంత వేతనమూ చెల్లించింది. మొత్తం 12 భారతీయ భాషలకు సంబంధించిన డేటాసెట్స్‌ని రూపొందించనుంది. ప్రభుత్వానికి సహకరించేందుకు తయారు చేసిన  GenAI చాట్‌బోట్‌ Jugalbandhi గురించీ ప్రస్తావించారు సత్య నాదెళ్ల. దీంతో పాటు Bhashini లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ గురించీ మాట్లాడారు. జుగల్‌బందీ చాట్‌బోట్‌ని భాషిణి ట్రాన్స్‌లేట్‌ టూల్‌ని కలిపి వినియోగించుకుంటే మారుమూల గ్రామాల్లో రకరకాల భాషలు మాట్లాడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 


"భారత్‌లోని కనీసం 20 లక్షల మంది విద్యార్థులకు AI స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ డొమైన్‌లోని పోటీని తట్టుకుని నిలబడాలంటే అందరికీ ఈ నైపుణ్యం ఉండాలి. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా అది సాధ్యమవుతుందని బలంగా విశ్వసిస్తున్నాం. దీని ద్వారా నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు వీలుంటుంది"


- సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో 


2025 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల GDP లక్ష్యంగా పెట్టుకుందన్న సత్యనాదెళ్ల ఆ సమయానికి AI టెక్నాలజీదే 500 బిలియన్ డాలర్ల వాటా ఉంటుందని అంచనా వేశారు. AIతో డిజిటలైజేషన్ మరింత ఊపందుకుంటుందని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా సౌత్ ఏషియా ప్రెసిడెంట్‌ కూడా ఈ ఈవెంట్‌లో మాట్లాడారు. భారత్‌లో ప్రస్తుతానికి లక్ష స్టార్టప్‌లున్నాయని, రోజుకి కనీసం 100 అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. 


ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో టెక్ కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. ఓపెన్ఏఐ లాంచ్ చేసిన ఛాట్‌జీపీటీ ఈ పోటీని మరింత తీవ్రం చేసింది. ఇప్పుడు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ పోరులోకి దిగింది. కంపెనీ ఇటీవల తన మొబైల్ ఏఐ యాప్‌ను పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ ఏఐ మొబైల్ యాప్‌కు కోపైలట్ అని పేరు పెట్టారు. ఈ యాప్ ఓపెన్ఏఐ ఛాట్‌జీపీటీ యాప్‌ని పోలి ఉంటుంది. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్ కోసం తన ఏఐ యాప్ కోపైలట్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇది యాపిల్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏఐ యాప్‌ను ఐఫోన్, ఐప్యాడ్ యాపిల్ పరికరాలలో కూడా ఉపయోగించవచ్చు. కోపైలట్ యాప్‌ను ఇంతకుముందు బింగ్ చాట్ అని పిలిచేవారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ పేరుతో కొన్ని అప్‌డేట్‌లతో యాప్‌ను తిరిగి లాంచ్ చేసింది.


Also Read: Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత, రైతుల ఆందోళనలతో ట్రాఫిక్ జామ్