Maharashtra - Gadchiroli: మారుమూల గ్రామంలో పుట్టి అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి చ‌దువుకునేందుకు ప‌రిత‌పిస్తున్న ఓ యువ‌తి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తహసీల్‌లోని రేగుంత అనే మారుమూల గ్రామంలో కోష్టి సామాజిక వర్గానికి చెందిన 27 ఏళ్ల కిరణ్ రమేష్‌ కూర్మవార్ అనే యువతి అసంఖ్యాక యువత‌కు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిమంతంగా మారింది. చదువుకు ప్రాధాన్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కిరణ్ ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని పోషించాలనే పట్టుదలతో ఉంది. సెప్టెంబరులో ప్రారంభమయ్యే ఒక సంవత్సరం కాల‌ప‌రిమితి క‌లిగిన‌ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ MSc కోర్సు కోసం ఇంగ్లండ్‌లోని ప్రతిష్ఠాత్మక లీడ్స్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందింది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగి, ఆమెకు అవ‌స‌ర‌మైన ఫీజులు, ఖ‌ర్చులకు డ‌బ్బు స‌మ‌కూరితే చ‌దువుకోవాల‌న్న‌ కిర‌ణ్ కోరిక నెర‌వేరుతుంది.


గ్రామీణ ప్రాంతాల వారికి, ముఖ్యంగా ఆంగ్ల భాషతో పోరాడుతున్న వారికి కిరణ్ ప్రయాణం నిజంగా స్పూర్తినిస్తుంది. కానీ ఆమె ప్ర‌యాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర‌య్యాయి. తన లక్ష్యాలను సాధించడానికి పురుషాధిక్యత ఎక్కువ‌గా ఉండే "డ్రైవర్" వృత్తిని చేపట్టింది. ఆమె తన గ్రామం నుంచి బీడ్ తాలూకాకు ప్రయాణికులను చేరవేస్తూనే, తన ల‌క్ష్య సాధ‌న కోసం ఉన్నత విద్య అవ‌కాశాల‌ను మెరుగుపరచుకోవ‌డానికి కృషి చేస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం పని చేసే ఏకలవ్య వర్క్‌షాప్‌లో తరగతులకు కిర‌ణ్‌ హాజరవుతోంది. 


మహిళ డ్రైవింగ్‌ సురక్షితంగా కాద‌ని భావించి ప్రయాణికులు ఆమె టాక్సీలో కూర్చోవడానికి నిరాక‌రించేవారు. అప్పుడు కిరణ్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుని, వారి నమ్మకాన్ని సంపాదించుకుంది. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా విదేశాల్లో చ‌ద‌వాల‌నే త‌న ల‌క్ష్య సాధ‌న‌పైనే ఆమె దృష్టిసారించింది.


విదేశాల్లో చ‌దువుకునేందుకు మీరు ఎలా సిద్ధమయ్యారు అని ఏబీపీ లైవ్‌ అడిగినప్పుడు.. విదేశాల్లో చదువుతున్న విద్యార్థి విశాల్ థాకరేను ఏకలవ్య వర్క్‌షాప్‌లో కలిశానని, అడ్మిషన్ ప్రక్రియపై తనకు దిశానిర్దేశం చేశాడ‌ని కిర‌ణ్ తెలిపింది. విశాల్ అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్టిన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి. కాగా.. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో MSc కోసం ఇంగ్లాండ్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో సీటు దొర‌క‌డానికి ముందు ఆమె అనేక విశ్వవిద్యాలయాలకు ప్రీ-ఎంట్రన్స్ పరీక్షలు రాసింది.


గడ్చిరోలి జిల్లాలో కిరణ్ మొదటి మహిళా ట్యాక్సీ డ్రైవర్ అని విశాల్ తెలిపారు. తాను మొదటిసారి ఆమెతో మాట్లాడినప్పుడు, ఇంగ్లిష్ స్థానిక భాషగా ఉన్న దేశంలో పని చేయడానికి లేదా చదువుకోవాలని కోరుకునే స్థానికేతరుల ఆంగ్ల భాష సామ‌ర్థ్యాన్ని పరీక్షించడానికి.. అంతర్జాతీయ ఆంగ్ల భాషా పరీక్షా వ్యవస్థ అయిన IELTS గురించి కూడా ఆమెకు తెలియదని చెప్పారు. "నేను కిరణ్‌కి నాకు వీలైనంత వరకు మార్గనిర్దేశం చేసాను, కానీ సొంత ప్ర‌తిభ‌తోనే ఆమె విశ్వ‌విద్యాల‌యంలో ప్రవేశం పొందింది" అని విశాల్‌ ABPకి తెలిపారు. “కిరణ్ కథ, పోరాటం నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఆమెకు అడ్మిషన్ వచ్చింది కానీ అక్కడ చదువుకు డబ్బులు ఇంకా స‌మ‌కూర‌లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను' అని విశాల్ తెలిపారు.


యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ అడ్మిషన్ కోసం 2023-24కి ట్యూషన్ ఫీజు 27,500 పౌండ్లు ( సుమారు రూ.28 లక్షలు) చెల్లించాల్సి ఉండ‌గా కిరణ్, ఆమె కుటుంబం ప్రస్తుతం స్కాలర్‌షిప్‌లు, ఆర్ధిక సహాయం అందించే వారి కోసం అన్వేషిస్తున్నారు. కిరణ్ తన కలలను సాకారం చేసుకోవాల‌ని, విద్యాభ్యాసం కొనసాగించాలని నిశ్చయించుకుంది. ఆమె చదువుకు అవ‌స‌ర‌మ‌య్యే డబ్బు సమకూర్చడానికి కిర‌ణ్‌ తండ్రి రమేష్ కూర్మవార్ వారి ఇంటిని తనఖా పెట్టడానికి సిద్ధమ‌య్యాడు.


“నేను టాక్సీ డ్రైవర్‌ని. నాకు ప్రమాదం జ‌రిగిన‌ తర్వాత, కిరణ్ డ్రైవింగ్ చేయడం ప్రారంభించి మా కుటుంబాన్ని పోషిస్తోంది. నా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. నాకు భూమి కూడా లేదు కానీ కిరణ్ చదువు కోసం డబ్బు ఏర్పాటు చేయడానికి మా ఇంటిని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె తన చదువును కొనసాగించాలి” అని కిరణ్ తండ్రి రమేష్ కూర్మవార్ అన్నారు.